విద్యార్థులకూ సెగ: తెలంగాణ ఆర్టీసీలో ఏపీ స్టూడెంట్స్కి నో, ఆందోళన
ఖమ్మం/విజయవాడ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య సరిహద్దుల్లో మరో కొత్త వివాదం చోటు చేసుకుంది. ఖమ్మం జిల్లా మధిర నుంచి బస్సుల్లో కొందరు ఆర్టీసీ సిబ్బంది ఏపీ విద్యార్థులను ఎక్కించుకునేందుకు నిరాకరించారని తెలుస్తోంది.
దీంతో, కృష్ణా జిల్లా నందిగామ రామిరెడ్డిపల్లె వద్ద విద్యార్థులు ఆందోళనకు దిగారు. తెలంగాణ బస్సులను అడ్డుకున్నారు. ఖమ్మం జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు కృష్ణా జిల్లాలోని నందిగామ, జగ్గయ్యపేట పేటలకు ఖమ్మం జిల్లా మధిర, వైరాలకు బస్సు సర్వీసులు ఉంటాయి.
ఆర్టీసీ బస్సుల్లో విద్యార్థులు ఎక్కి కాలేజీలకు వెళ్తుంటారు. ఆర్టీసీ రెండుగా విడిపోయిన తర్వాత ఖమ్మం జిల్లాకు చెందిన బస్సుల్లో ఆంధ్రా విద్యార్థులను ఎక్కించేందుకు నిరాకరిస్తున్నారు. బస్ పాస్లు చెల్లవని చెబుతున్నారని తెలుస్తోంది. దీంతో, విద్యార్థులు బస్సులను అడ్డుకున్నారు.
తెలంగాణ విద్యార్థులను ఏపీ బస్సుల్లో ఎక్కించుకున్నప్పుడు, తమను కూడా తెలంగాణ బస్సుల్లో ఎక్కించుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రెండు వైపులా పాస్లు నడిచేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు.