అంతలోనే: బాబు మీద పైచేయి కోసం కేసీఆర్, ఆనందంతో కార్మికుడి గుండె ఆగింది
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు... ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మికులు 43 శాతం ఫిట్మెంట్ కోసం డిమాండ్ చేశారు.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ కార్మికులు 43 శాతం ఫిట్మెంట్ డిమాండుపై ఏమాత్రం తగ్గలేదు. దీని కోసం వారం రోజులుగా వారు సమ్మె చేశారు. ప్రయాణీకులు ఇబ్బందులు పడ్డారు.
ఇరు ప్రభుత్వాలు ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపాయి. 43 శాతం ఫిట్మెంట్ పైన తర్జన భర్జన పడ్డాయి. ఓ సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు 43 శాతం ఫిట్మెంట్ కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. కొత్త రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం కావడంతో 43 శాతం ఫిట్మెంట్ కష్ట సాధ్యమని అభిప్రాయపడ్డారు.
అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం కాకపోయినప్పటికీ.. 40 శాతం వరకు ఫిట్మెంట్కు అంగీకరిస్తామని కార్మిక సంఘాలకు చెప్పాయి. కానీ కార్మిక సంఘాలు తగ్గలేదు. మరోవైపు, 43 శాతం ఫిట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం ఇస్తే మనకు చిక్కులు అని ఏపీ ప్రభుత్వం అభిప్రాయపడింది.
అంతలోనే...
అయితే, అనూహ్యంగా బుధవారం నాడు ఏపీ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్కు అంగీకరించింది. తెలంగాణ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్ ప్రకటిస్తే ఇబ్బందులు తప్పవని ఏపీ ఆర్టీసీ కార్మిక సంఘాల డిమాండుకు ఓకే చెప్పాయి. కానీ, ఆ వెంటనే ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలు జరిపిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 44 శాతం ఫిట్మెంట్ ప్రకటించింది.
కార్మికులు 43 శాతం ఫిట్మెంట్కు డిమాండ్ చేస్తే... దాని పైనే ఇన్నాళ్లు తర్జన భర్జన పడిన ప్రభుత్వం హఠాత్తుగా 44 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం గమనార్హం. చంద్రబాబుపై పైచేయి కోసమే కేసీఆర్ ఒక్క శాతం ఎక్కువగా ఇచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఆర్టీసీ కార్మికుడు మృతి
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మెకు ఆయా ప్రభుత్వాలు ముగింపు పలికాయి. ఏపీలో 43 శాతం ఫిట్మెంట్, తెలంగాణ రాష్ట్రంలో 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ నేపథ్యంలో కడప జిల్లాలో ఓ కార్మికుడు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.
మంత్రివర్గ సంఘంతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. ఏపీ ప్రభుత్వం 43 శాతం ఫిట్మెంట్కు అంగీకరించింది. అంతేకాకుండా గత మూడు నెలల బకాయిలను దసరా, దీపావళి సమయంలో ఇస్తామని చెప్పింది.
పాత బకాయిలను రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో పులివెందులకు చెందిన నారాయణ అనే కార్మికుడు మృతి చెందాడు. అతను ఆనందం పట్టలేక గుండె ఆగి మృతి చెందినట్లుగా తెలుస్తోంది.