ఏపీలో చిక్కుకున్న తెలంగాణా విద్యార్థుల తిప్పలు ... ఇళ్ళకు పంపమని వేడుకోలు
కరోనా లాక్ డౌన్ ఎఫెక్ట్ చదువుకోటానికి పక్క తెలుగు రాష్ట్రం వెళ్ళిన విద్యార్థులకు తిప్పలు తెచ్చి పెట్టింది . ఒక రోజు, రెండు రోజులు కాదు ఏకంగా నెల రోజులకు పైగా కొనసాగుతున్న లాక్ డౌన్ తో అటు తరగతులు జరగక, ఇటు తినటానికి తిండిలేక , ఆదుకునే దిక్కు లేక అలమటిస్తున్నారు చాలా మంది విద్యార్థులు . ఊరుకాని ఊరిలో చేతిలో చిల్లి గవ్వ లేక ఆత్మాభిమానం చంపుకోలేక దుర్భర జీవితాన్ని గడుపుతున్న విద్యార్థులు మమ్మల్ని మా స్వస్థలాలకు పంపించి ఆదుకోండి అంటూ దీనంగా అభ్యర్థిస్తున్నారు.
పేదల ఆకలి తీర్చటమే నిజమైన ఛాలెంజ్... 'గో హంగర్ గో' అంటూ ఎమ్మెల్యే సీతక్క సవాల్ !!
లాక్ డౌన్ తో ఏపీలో చిక్కుకున్న డీఎస్సి విద్యార్థులు
డీఎస్సీ శిక్షణ కోసం కృష్ణాజిల్లాలోని అవనిగడ్డకు వచ్చిన విద్యార్థులు లాక్డౌన్ కారణంగా నరకం చూస్తున్నారు . 341 మంది విద్యార్థులు డీఎస్సీ శిక్షణ కోసం రాష్ట్రం నుంచే కాక తెలంగాణ నుంచి వచ్చి ఇక్కడ కేంద్రాల్లో శిక్షణ పొందుతుంటారు. ఇక అలా వచ్చిన వారిలో 341 మంది విద్యార్థులు లాక్డౌన్ కారణంగా నరకం చూస్తున్నారు . కొంత కాలం పాటు ఎలాగోలా కాలం వెళ్ళదీస్తే ఇళ్ళకు వెళ్లిపోవచ్చు అని భావించిన విద్యార్థులు తమ వద్ద ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఆకలి బాధ తీర్చుకున్నారు.
చేతిలో డబ్బు లేక తినటానికి తిండి లేక పడరాని పాట్లు
ఆ తర్వాత అక్కడ ఉన్న విద్యార్థులకు కొద్ది రోజుల పాటు ఆర్యవైశ్య సంఘం ఆహార పొట్లాలను సరఫరా చేసింది. ఈనెల 15 నుంచివారు కూడా భోజనం అందించటం ఆపేశారు . ఆహార సరఫరా నిలిచిపోయింది. దీంతో ఏం చెయ్యాలో పాలుపోక ఇబ్బంది పడుతున్న వాళ్లకు రెవెన్యూ అధికారులు బియ్యం, పప్పులు, ఉప్పు , తదితర వంట సామగ్రి ఇచ్చి వండుకు తినాలని చెప్పారు. దీంతో వారి కష్టాలు రెట్టింపయ్యాయి. నానా తంటాలు పడుతూ ఎలక్ట్రికల్ స్టవ్లపై అన్నం వండుకొని పచ్చడితో కాలం వెళ్లదీస్తున్నామని వారు చెప్తున్నారు.
స్వస్థలాలకు పంపించాలని ఎమ్మార్వోకు వేడుకోలు
ఇక వారు అద్దెకు ఉన్న ఇంటి యజమానులు విద్యుత్ బిల్లులు చెల్లించమని ఒత్తిడి చేస్తున్నారని తమకు తినటానికే డబ్బు లేక ఇబ్బంది పడుతున్నామని ఎలాగైనా తమను పంపించాలని వేడుకుంటున్నారు. వీరంతా తహసీల్దారు కార్యాలయానికి వచ్చి స్వస్థలాలకు పంపాలని తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఒక్క అవని గడ్డలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో చాలా మంది విద్యార్థులు చిక్కుకుపోయి ఇబ్బంది పడుతున్నారు. ఎటూ వెళ్ళటానికి లేని పరిస్థితిలో నరకం చూస్తున్నారు . తినటానికి తిండి లేక , చేతిలో డబ్బు లేక , ఇంటి నుండి డబ్బు పంపిస్తారన్నా వారికి లాక్ డౌన్ తో సంపాదన లేక నరకం చూస్తున్నారు.
Recommended Video