టీటీడీ బోర్డు సభ్యునిగా టీటీడీపీ నేత
అమరావతిః ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యునిగా తెలుగుదేశం పార్టీకి చెందిన మరో నాయకుడు ఎంపిక అయ్యారు. ఆయన పేరు కోనేరు సత్యనారాయణ. కెఎల్యు యూనివర్శిటీ ఛైర్మన్ ఉన్నారు. కోనేరు లక్ష్మయ్య ఫౌండేషన్ను ఆయన నెలకొల్పారు. ఆయనను టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు సోమవారం వెలువడే అవకాశం ఉంది. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన కోనేరు సత్యనారాయణ చాలాకాలంగా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు.
కోనేరు సత్యనారాయణ 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో 28 వేల వరకు ఓట్లు వచ్చాయి. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా టీటీడీ బోర్డు సభ్యునిగా నియమించాలని నిర్ణయించినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతోంది. తెలంగాణకు చెందిన వారే అయినప్పటికీ.. కోనేరు సత్యనారాయణకు సంబంధించిన వ్యాపార కార్యకలాపాలు అధిక శాతం విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్నాయి.
తాజాగా- టీటీడీ బోర్డు నుంచి ఉద్వాసనకు గురైన తెలంగాణ తెలుగుదేశం పార్టీకి చెందిన సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన నాయకుడే. టీటీడీ బోర్డు సభ్యునిగా నియమితులైన నెల రోజులు దాటినప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారం చేయలేదనే కారణంతో చంద్రబాబు ప్రభుత్వం సండ్ర వెంకట వీరయ్యకు ఉద్వాసన పలికింది. ఈ మేరకు రెండు రోజుల కిందటే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. నిజానికి- తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండటం, తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ లో చేరడానికి ఆయన సిద్ధంగా ఉన్నారనే కారణం వల్లే సండ్రను తొలగించినట్లు చెబుతున్నారు.