సెటిలర్లు టిఆర్ఎస్కు ఓటేసే పరిస్థితి లేదు, కెసిఆర్ బినామీల సర్వే: ఏపీలో రేవంత్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ కొడంగల్ ఎమ్మెల్యే, తెలంగాణ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఆదివారం నాడు ఆంధ్రప్రదేశ్లో కనిపించారు. ఆయన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.
ఆయన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి స్వామి వారిని దర్సించుకున్నారు. పూజలు నిర్వహించారు. రేవంత్ రెడ్డికి స్వాగతం పలికిన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రొటోకాల్ అధికారులు, ఆయనకు తీర్థప్రసాదాలు ఇచ్చారు.అనంతరం ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడారు.
గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీల విజయం ఖాయమని చెప్పారు. గతంలో సెటిలర్ల పైన తీవ్ర విమర్శలు చేసి, ఇప్పుడు వారి ఓట్ల కోసం అధికార టిఆర్ఎస్ పార్టీ వెంపర్లాడుతోందని ఎద్దేవా చేశారు. సెటిలర్లు ఎవరూ వారికి ఓట్లేసే పరిస్థితి లేదన్నారు.
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో తెరాస పార్టీ 75 నుంచి 85 సీట్లు గెలుచుకుంటుందని, టిడిపి - బిజెపి 20 నుంచి 25 సీట్లు గెలుచుకుంటుందని ఓ సర్వే చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిపై రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ బినామీ సర్వేలు చేయించుకుంటున్నారని, వాటిని నమ్మాల్సిన అవసరం లేదన్నారు.
రిజర్వేషన్లు రాకముందే చేసిన సర్వే ప్రామాణికత ఎంతో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. హైదరాబాదు అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందని చెప్పారు.