టీ స్థానికతపై గొడవ: గవర్నర్ ప్లాన్కు విఘాతం ?
హైదరాబాద్: స్థానికతపై సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల మధ్య తలెత్తిన వివాదం ఈ నెల 26వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా రెండు రాష్ట్రాలను నడిపించాలనే గవర్నర్ నర్సింహన్ ప్రయత్నానికి విఘాతం కలిగించే విధంగా ఉంది. తెలంగాణలో ఉండిపోవాలని చూస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను ఎట్టి పరిస్థితిలోనూ అనుమతించబోమని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు గురువారంనాడు చెప్పారు.
తెలంగాణ స్థానికులుగా చెప్పుకుంటున్న 193 మంది అధికారులపై తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం (ఎస్టిఇఎ) అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. మొత్తం ప్రక్రియను సమీక్షించాలని డిమాండ్ చేస్తోంది. ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులను సచివాలయంలో పనిచేయనీయబోమని తెలంగాణ సిబ్బంది సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు తెలంగాణ సచివాలయంలో ఎలా పనిచేస్తారని అడుగుతున్నారు. తెలంగాణ ఉద్యోగులు మాత్రమే పనిచేయాలని వారంటున్నారు. ఇక్కడే ఉండిపోవడానికి కొంత మంది సీమాంధ్ర ఉద్యోగులు పత్రాలను ఫోర్జ్ చేస్తున్నారని, అటువంటివారు 193 మంది ఉన్నారని తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎం. నరేంద్ర రావు అంటున్నారు.
తెలంగాణలో ఉద్యోగాల కోసం నకిలీ సర్టిఫికెట్లు సమర్పించినవారిపై పోలీసు కేసులు పెడుతామని తెలంగాణ ఉద్యోగుల సంఘాలు అంటున్నాయి. తెలంగాణకు సీమాంధ్ర ఉద్యోగుల కేటాయించడాన్ని కోర్టులో సవాల్ చేయాలని కూడా నిర్ణయించుకున్నాయి. సీమాంధ్ర, తెలంగాణ ఉద్యోగుల గొడవతో జూన్ 2వ తేదీలోగా ప్రయోగాత్మకంగా రెండు రాష్ట్రాలను నడపాలనే గవర్నర్ నరసింహన్ ప్రణాళికకు విఘాతంగా మారే అవకాశం ఉంది.
నకిలీ స్థానిక ధ్రువపత్రాలను సమర్పించి తెలంగాణలో ఉండిుపోవడానికి ప్రయత్నిస్తున్న సీమాంధ్ర ఉద్యోగుల వివరాలను తాము సేకరిస్తున్నట్లు తెలంగాణ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు జి. దేవీప్రసాద రావు చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా పోస్టింగులు పొందిన సీమాంధ్ర ఉద్యోగుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వారి వివరాలను సేకరించాలని ఆయన తెలంగాణ ఉద్యోగులకు సూచించారు.
అన్ని శాఖల్లో ఉద్యోగుల విభజనను 25వ తేదీలోగా పూర్తి చేయాలని గవర్నర్ నిర్ణయించారు. 26వ తేదీ నుంచి ప్రయోగాత్మకంగా రెండు రాష్ట్రాలను నడపాలని ఆయన అనుకున్నారు.