అందుకే కెసిఆర్ బతికుండగా రాదు: టిపై టిజి వెంకటేష్
రాయల తెలంగాణ ప్రతిపాదనల నేపథ్యంలో తెరాస ఇచ్చిన తెలంగాణ బంద్ విఫలమైందన్నారు. కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, తెరాసలు త్వరలో కాంగ్రెసు పార్టీలో విలీనం అవుతాయని టిజి వెంకటేష్ జోస్యం చెప్పారు.
రాష్ట్ర విభజనకు ఆంధ్ర, రాయలసీమ నాయకులే శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి ముందు స్పందించని వాళ్లు ఆ తర్వాత స్పందించారని విమర్శించారు. భద్రాచలమే కాకుండా శ్రీశైలం, చిత్తూరు, విశాఖలను కూడా తీసుకోండని వ్యాఖ్యానించారు. పది లేదా పన్నెండు జిల్లాలతో కూడిన తెలంగాణ తమకు ఎప్పుడు సమ్మతం కాదన్నారు. తాను సమైక్యవాదానికే కట్టుబడి ఉంటానని చెప్పారు.
రాయల తెలంగాణ ఎవరు అడిగారని, రాయలసీమను విభజిస్తే అనేక సమస్యలు వస్తాయని తెలుగుదేశం పార్టీ ఎంపీలు శివ ప్రసాద్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఢిల్లీలో అన్నారు. శివప్రసాద్ మాట్లాడుతూ రాయల తెలంగాణ ప్రతిపాదన కాంగ్రెస్ నిర్ణయమని, ఎవరూ కోరలేదని అన్నారు.
తెలంగాణ ప్రజలను మభ్య పెట్టడానికే ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తెరపైకి తీసుకు వచ్చిందని ఆయన అన్నారు. మోదుగుల మాట్లాడుతూ తెలుగు ప్రజల సమస్యలపై పార్లమెంటు సమావేశాల్లో లేవనెత్తుతామని అన్నారు. ప్రధానమంత్రి చలనం లేకుండా వ్యవహరిస్తున్నారని, ఆయన ఓ మైనపు బొమ్మని, ఆయనను కలిసినా ఒకటే, కలవకపోయినా ఒకటే అని ఆయన పేర్కొన్నారు.