జగన్ ఇంట్లో దీక్ష చేసుకోవచ్చు, ఫరక్ లేదు: కెసిఆర్
హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర నేతలు దీక్షలే కాదు.. ఇంకేం చేసినా ఫలితం ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లాలోని తన ఫాంహౌస్లో తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు, పార్టీ నేతలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ నోట్కు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపిన నేపథ్యంలో వివిధ అంశాలపై నేతలతో చర్చించినట్లు సమాచారం.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తథ్యమని, ఇక పార్లమెంటులో బిల్లు పెట్టడమే తరువాయని ఆయన చెప్పారు. సీమాంధ్ర నేతలు తెలంగాణ ఏర్పడుతున్న సమయంలో అడ్డుకునే ప్రయత్నాలు విరమించి అక్కడి ప్రజల ఇబ్బందులు ఏమిటో చెబితే వారికి మేలు చేసినట్లవుతుందని ఆయన అన్నారు. విభజన తర్వాత కూడా రెండు ప్రాంతాల మధ్య మంచి సంబంధాలే ఉంటాయని ఆయన తెలిపారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బహిరంగ సమావేశాలు పెడితే అడ్డుకుంటాం గానీ, తన ఇంట్లో కూర్చుని దీక్ష చేస్తే మనకు ఏం ఫరక్ పడదని నేతలకు చెప్పినట్లు తెలిసింది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ బేస్ పోవడంతో.. ఢిల్లీలో దీక్ష చేసి సీమాంధ్రలో తన పార్టీని కాపాడుకోవాలని ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చూస్తున్నాడని కెసిఆర్ అన్నారు. సీమాంధ్ర నేతలు ఎన్ని చేసినా తెలంగాణ ఆగబోదని, వాళ్ల దీక్షలను పట్టించుకోకపోవడమే మంచిదని పార్టీ నేతలకు సూచించారు.
నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ తొలివారంలో తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని, ఆ తర్వాత వారం పదిరోజుల్లో కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పినట్లు సమాచారం. ఈ భేటీలో ప్రధానంగా హైదరాబాద్పై చర్చించినట్లు సమాచారం. హైదరాబాద్ను పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కేంద్రం ప్రకటించిన మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకే నగరం నుంచి కార్యకలాపాలను కొనసాగించాల్సి వస్తుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో కీలకమైన శాంతి భద్రతలు, విద్యుత్, ఉద్యోగ నియామకాలు, మున్సిపల్, భూ పరిపాలన వ్యవహారాలు, రెవెన్యూ అంశాలు కేంద్రం చేతిలోకి వెళ్లే అవకాశం ఉందని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలని పార్టీ నేతలకు కేసీఆర్ వివరించారు. హైదరాబాద్పై సంపూర్ణ హక్కులతో కూడిన తెలంగాణ కోసమే పట్టుబట్టాలని కేసీఆర్ చెప్పారు.
హైదరాబాద్పై ఆంక్షలు లేని తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు అప్రమత్తంగా ఉండాలని పార్టీ, ఉద్యోగ సంఘాల నేతలకు సూచించారు. గతంలో చెప్పినట్లుగానే హైదరాబాద్పై ఎలాంటి ఆంక్షలు లేకుండా.. సంపూర్ణ అధికారాలతో తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టిఆర్ఎస్ను విలీనం చేసే ఆలోచన చేద్దామని పార్టీ నేతలకు తెలిపారు. ఆంక్షలతో కూడిన హైదరాబాద్కు అంగీకరిస్తే చెన్నారెడ్డిలా బద్నామవుతామని ఆయన పార్టీ నేతలతో అన్నారు. సంపూర్ణ తెలంగాణ ఏర్పాటు చేసేందుకు బిల్లు రూపొందిస్తేనే అంగీకరిద్దామని, లేనిపక్షంలో ఉద్యమ కార్యాచరణను నిర్మించుకుందామని నేతలతో అన్నారు.