మీరు కాదు, మేమే మీకు విద్యుత్ కట్ చేస్తాం: ఏపీకి తెలంగాణ హెచ్చరిక
తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదం మరోసారి తారస్థాయికి చేరేలా కనిపిస్తోంది. ఇప్పటికే తమకు చెల్లించాల్సిన సుమారు రూ.3,138కోట్ల బకాయిలను చెల్లించని కారణంగా మే 31వ తేదీ నుంచి విద్యుత్ .
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదం మరోసారి తారస్థాయికి చేరేలా కనిపిస్తోంది. ఇప్పటికే తమకు చెల్లించాల్సిన సుమారు రూ.3,138కోట్ల బకాయిలను చెల్లించని కారణంగా మే 31వ తేదీ నుంచి విద్యుత్ నిలిపివేస్తామని తెలంగాణకు ఏపీ జెన్కో నుంచి నోటీసులు జారీ అయిన సంగతి తెలిసిందే. కానీ, బకాయిల చెల్లింపుపై ఎలాంటి స్పందన లేకపోవడంతో విద్యుత్ నిలిపివేయడానికే ఏపీ జెన్ కో నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
అయితే, ఈ నేపథ్యంలో తాజాగా తెలంగాణ కూడా ఏపీ జెన్కోకు నోటీసులు జారీ చేసింది. లెక్కలు సరిచూస్తే ఏపీ విద్యుత్ సంస్థలే రూ.1,676 కోట్లు చెల్లించాల్సి ఉందని, వెంటనే ఆ బకాయిలు చెల్లించాలంటూ ఏపీకి తేల్చి చెప్పింది. అంతేగాక, బకాయిలు చెల్లించని పక్షంలో ఏపీకి విద్యుత్ సరఫరా నిలిపివేస్తామని తెలంగాణ జెన్కో, ట్రాన్స్ కో సీఎండీ డి ప్రభాకర్ రావు ఘాటుగా స్పందించారు.
మూడేళ్లుగా ఇరు రాష్ట్రాల మధ్య బిల్లుల బకాయి వివాదం కొనసాగుతుండగా, తాజాగా పరస్పరం నోటీసులు జారీ చేసుకోవడంతో మరింత వేడి రాజుకుంటోంది. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ఉమ్మడి రాష్ట్ర జెన్కో ప్లాంట్ల నుంచి తెలంగాణకు 58:89శాతం, ఏపీకి 46: 11శాతం వాటాలున్నాయి. ఈ ప్రకారమే విద్యుత్ పంపకాలు జరుగుతున్నాయి. అయితే, వివాదాలతో రెండు రాష్ట్రాల మధ్య విద్యుత్ పంపకాలు ఆగిపోయినా కరెంటు సరఫరాలో మాత్రం సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి తలెత్తలేదు.
తెలంగాణకు బకాయి దెబ్బ: ఏపీ నుంచి 'పవర్' కట్, ఈరోజే ఆపేస్తారా!?
ఇది ఇలా ఉండగా, విద్యుత్ బకాయిల సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని ఏపీపీసీసీని పలుమార్లు కోరినా పట్టించుకోలేదని తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ, తెలంగాణ విద్యుత్ సమన్వయ కమిటీ ఛైర్మన్ డి ప్రభాకర్ రావు తెలిపారు. బకాయిలు చెల్లించకపోతే ఏపీకి విద్యుత్ నిలిపివేస్తామని తేల్చి చెప్పారు.