తెలంగాణ రచయిత స్కైబాబకు నిరసన సెగ: విజయవాడలో ఉద్రిక్తత
విజయవాడ: విజయవాడలోని పుస్తకమహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రచయిత స్కైబాబకు తీవ్ర నిరసన వ్యక్తమైంది. విజయవాడ పుస్తక మహోత్సవంలో కొంత మంది ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో స్కైబాబా రాసిన రాతలకు క్షమాపణలు చెప్పిన తర్వాతే పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని వారు డిమాండ్ చేశారు.
మా తెలుగు తల్లి పాట పాడిన తర్వాతే పుస్తకావిష్కరణ జరగాలని ఆందోళనకు దిగారు. సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో స్కైబాబా రాసిన రచనలు చాలా అభ్యంతరకరంగా ఉన్నాయని, దీనికి ఆయన క్షమాపణలు చెప్పిన తర్వాతే పుస్తకావిష్కరణ చేసుకోవాలని భాషాబిమానులు స్పష్టం చేశారు.
స్కైబాబ రాతలపైనే...
స్కైబాబా రాసిన పుస్తకానికి సంబంధించి తాము ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయడంలేదని, కానీ ఉద్యమ సమయంలో స్కైబాబా ఆంధ్రులను ఉద్దేశించి రాసిన అసభ్యకర రచనలపై ఆయన ఇక్కడ అందరిముందు బహిరంగ క్షమాపణ చెప్పి, ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ' పాట పాడిన తర్వాతనే ఆయన తన పుస్తకాన్ని ఆవిష్కరించుకోవాలని అన్నారు.
స్కైబాబ రాసిన రాతలేమిటి..
‘‘ఆరే ఆంధ్రుడా నంగినంగి వేషాలు వద్దు, నక్కతలుపులు ఇకపై చూపెట్టొద్దు, బెజవాడకు మెయిలు కడతాం, బద్మాష్లంతా బదాయించాలి'' వంటి స్కైబాబ రాసిన కొన్ని రచనలను వారు చదివి వినిపించారు. తమకంటూ ఆత్మగౌరవం ఉందని, స్కైబాబా సభా ముఖంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు.
బుధవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత
స్కైబాబను సంపాదకత్వంలో వెలువడిన పుస్తకావిష్కరణ సభను అడ్డుకున్నది తెలుగుదేశం పార్టీ నాయకులంటూ స్థానికంగా మీడియాలో వార్తలు వచ్చాి. నిర్వాహకులతో తీవ్ర స్థాయిలో వాగ్వివాదానికి దిగారు. దీంతో పుస్తకావిష్కరణ సభ వాయిదా పడింది. స్కైబాబను రచయితల సంరక్షణలో నిర్వాహకులు అక్కడి నుంచి తరలించారు. ఈ సమయంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అప్పుడు ఇలా జరిగింది.
విజయవాడ పుస్తక మహోత్సవంలో స్కైబాబ సంపాదకత్వంలో వెలువడిన 35 మంది మైనారటీ కవులు రాసిన కవితాసంకలనం మొఖామిని బుధవారం రాత్రి ఆవిష్కరించాల్సి ఉంది. దానికి ముందే అక్కడికి ఆందోళనకారులు అక్కడికి చేరుకున్నారు. పుస్తకావిష్కరణకు, స్కైబాబకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో స్కైబాబ ఆంధ్రులను తిడుతూ అసభ్యకరమైన కవితలు రాశారని, ఆయన పుస్తకాన్ని ఎలా ఆవిష్కరిస్తారని వారుర ప్రశ్నించారు.
ఆందోళకు దిగింది వీరే...
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నె వెంకటప్రసాద్ (అన్నా), టిడిపి కార్పోరేటర్ చెన్నుపాటి గాంధీ, తెలుగు యువత నాయకులు చాగంటి విజయభాస్కర్, తెలుగుదేశం పార్టీకే చెందిన మహిళలు, కార్యకర్తలు, టిడిపి సోషల్ మీడియా విభాగానికి చెందిన కార్యకర్తలు ఆందోళనలో పాల్గొన్నారు.
అలా చెప్పినా వినలేదు..
ప్రస్తుతం ఆవిష్కరిస్తున్నది స్కైబాబ రాసిన పుస్తకం కాదని, ఆయన సంపాదకత్వంలో వచ్చిన మైనారిటీ కవిత్వమని నిర్వాహకులు నచ్చజెప్పడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు. స్కైబాబ కవితతో తాము ఏకీభవించడం లేదని అయితే పుస్తకాన్ని ఆవిష్కరించుకునే హక్కు ఆయనకు ఉందని కూడా చెప్పినా ఆందోళనకారులు వెనక్కి తగ్గలేదు. దాంతో కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
పోలీసుల తీరు వివాదాస్పదం
పుస్తకావిష్కరణ సభ కార్యక్రమాన్ని ముందుగానే ప్రకటించారు. అయితే, ఆందోళనకు దిగిన తెలుగుదేశం పార్టీ నాయకులను పోలీసులు నిలువరించడానికి బదులు వారికి అండగా ఉండే పద్ధతిలో వ్యవహరించారనే విమర్శలు వస్తున్నాయి. ఒక దశలో ఎసిపి కె. శ్రీనివాసులు నిర్వాహకులను, ప్రచురణకర్తలను ఆరు నెలల పాటు లోపలేస్తామని హెచ్చరించినట్లు చెబుతున్నారు.
ఇలా వివరణ..
విజయవాడ పుస్తక మహోత్సవంలో ఎవరైనా కార్యక్రమాలను నిర్వహించుకోవచ్చునని పుస్తక మహోత్సవ్ సమన్వయకర్త, ఎమెస్కో బుక్హౌస్ అధినేత కె విజయకుమార్ అన్నారు. అందుకే అనుమతించామని, పుస్తక మహోత్సవ్లో ఎవరైనా ఒక్కటేనని ఆయన అన్నారు. అయితే కొంత మంది మనోభావాలు దెబ్బ తిన్న కారణంగా స్కైబాబ పుస్తకావిష్కరణను నిలుపుదల చేసినట్లు ఆయన ప్రకటించారు.
భద్రత కల్పించి మరీ...
స్కైబాబకు వ్యతిరేకంగా పెల్లుబుకిన నిరసన సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితి ఉద్రిక్తంగా ఉందని, వెళ్లిపోవాలని విజయవాడ పోలీసులు స్కైబాబకు చెప్పినట్లు సమాచారం. విజయవాడ ఘటనను తెలుసుకున్న హైదరాబాద్ కమిషనర్ ఇంచార్జీ శ్రీనివాస రావు విజయవాడ పోలీసు కమిషనర్ గౌతమ్ సవాంగ్తో మాట్లాడారు. వారిద్దరు కూడా రాత్రి స్కైబాబతో మాట్లాడి భరోసా ఇచ్చారు. వాహనం ఏర్పాటు చేసి, తగిన భద్రతతో గౌతమ్ సవాంగ్ స్కైబాబను హైదరాబాదు పంపించారు.