"తానా"..టీడీపీకి తందానా? వైఎస్ఆర్ సీపీ నేత కీలక వ్యాఖ్యలు
అమరావతి: తానా. దీన్ని విడమరిచి చెప్పుకొంటే- తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా. అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్ ప్రధాన కేంద్రంగా ఆవిర్భవించిన పదహారాణాల తెలుగు సంఘం. దీనికున్న చరిత్ర అంతా ఇంతా కాదు. 1977లోనే ఈ సంఘం ఆవిర్భవించింది. ప్రతిష్ఠాత్మక నిమ్స్ డైరెక్టర్గా పనిచేసిన కాకర్ల సుబ్బారావు మానస పుత్రిక ఇది. విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాల కోసం అమెరికాకు వెళ్లిన రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన తెలుగు వారు తానాను నిర్వహిస్తున్నారు. తానా అనగానే- అచ్చమైన తెలుగుదనం మన కళ్లముందు కదలాడుతుంది. అమెరికాలో నివసిస్తున్నప్పటికీ.. తెలుగు సంస్కృతికి దగ్గరగా తిరుగాడే ఆడపడచులు సాక్షాత్కరిస్తారు. సంక్రాంతి సరదాలు కనిస్తాయి. ఉగాది హడావుడీని మనం చూడొచ్చు.
ప్రతిష్ఠ మసకబారుతోందా?
చిన్న పిల్లల నుంచి పెద్ద వారి వరకూ తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా వస్త్రధారణతో కలియ తిరుగుతూ కనిపిస్తుంటారు ఆయా సందర్భాల్లో. ఇక- తానా సభల గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. ఎందుకంటే- తానా సభల ఆహ్వానం అందడం అంటే గొప్ప విషయం. తానా నిర్వాహకులు ఏటా ఈ సభలను నిర్వహిస్తుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులను దీనికి ఆహ్వానిస్తుంటారు. విద్య, వైద్యం, సినిమా, రాజకీయం.. ఇలా దాదాపు అన్నిరంగాల్లో నిష్ణాతులైన తెలుగు వారిని అమెరికాకు సొంత ఖర్చులతో ఆహ్వానిస్తుంటారు. ఇంచుమించు- నాలుగు దశాబ్దాలుగా ఈ కార్యక్రమం కొనసాగుతూ వస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రవాసాంధ్రులు ఎక్కడైనా ఉమ్మడి ఓ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారంటే- అది తానా సభలు ఒక్కటే అనే అభేద్యమైన గుర్తింపు ఉంది.
ఒక కులానికే పరిమితమైందా?
క్రమంగా- ఇటీవలి కాలంలో తానా ప్రతిష్ఠ మసకబారుతోందా? అనిపించేలా ఆరోపణలు వస్తున్నాయి. కులం రంగు అంటుకుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి కారణం- తానా నిర్వాహకుల వైఖరే అనే ఆరోపణలు తరచూ వినిపిస్తున్నాయి. కమ్మ సామాజిక వర్గానికి చెందన కొందరు ప్రముఖుల చేతుల్లో ఈ ప్రతిష్ఠాత్మక తెలుగు సంఘం ఇమిడిపోయిందనే విమర్శలు ఈ అయిదేళ్ల కాలంలో వినిపిస్తూ వచ్చాయి. ఈ సారి ఆ ఆరోపణలు కాస్తా మరింత ఉగ్రరూపాన్ని సంతరించుకున్నాయి. ప్రత్యేకించి- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తానాపై విమర్శలు గుప్పిస్తున్నారు. తానా సభలకు హాజరైన భారతీయ జనతాపార్టీ సీనియర్ నేత, ఈశాన్య రాష్ట్రాల ఇన్ఛార్జి, తెలుగువాడైన రామ్మాధవ్ ఉదంతమే దీనికి నిదర్శనంగా చెబుతున్నారు. తానా సభల ఆహ్వానితుడిగా వెళ్లిన రామ్ మాధవ్.. వేదికపై ప్రసంగిస్తుండగా అహూతులు ఆయనను అడ్డుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేరును రామ్ మాధవ్ ప్రస్తావించిన సందర్భంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
తానా సభల్లో రాజకీయ ప్రసంగాలు ఉండవా?
సాధారణంగా తానా సభల్లో రాజకీయ ప్రసంగాలు వినిపించవు. ఆయా రంగాలకు చెందిన ప్రముఖులు.. తాము సాధించిన విజయాలను ఏకరువు పెడుతుంటారు. ఓ రోల్ మోడల్గా మారుతుంటారు. తోటి తెలుగు వారికి స్ఫూర్తిని నింపేలా ప్రసంగిస్తుంటారు. రాజకీయ నాయకులు సైతం తమ పార్టీ విధానాన్ని పక్కన పెడుతుంటారు. కొన్నేళ్లుగా.. ప్రత్యేకించి- 2014 తరువాత తానా సభల్లో కమ్మ సామాజిక వర్గ ప్రముఖుల పెత్తనం పెరిగిపోయిందనే ఆరోపణలు ఊపందుకుంటూ వచ్చాయి. 2014 తరువాత ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా పగ్గాలను స్వీకరించిన అనంతరం తానా.. టీడీపీకి తందానా కొట్టడం మొదలైందని వైఎస్ఆర్ సీపీ నాయకులు బాహటంగా విమర్శిస్తున్నారు. తాజాగా- వైఎస్ఆర్ సీపీకి చెందిన శివశంకర్.. ఓ న్యూస్ ఛానల్లో ఆదివారం నిర్వహించిన చర్చల సందర్భంగా ఈ ఆరోపణలు చేశారు.
తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్గా..
పెట్టుబడుల పేరుతో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన హయాంలో ఒకట్రెండు సార్లు అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా తానా మేనేజ్మెంట్ కమిటీ ప్రతినిధులు కొందరు ఆయన అడుగులకు మడుగులు ఒత్తారని వైఎస్ఆర్ సీపీ నాయకులు విమర్శిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి అనుబంధ విభాగంగా మారిందని ఆ పార్టీ నాయకుడు శివశంకర్ ఆరోపించారు. అలాంటి సభలకు బీజేపీ నేత రామ్మాధవ్ను ఆహ్వానించి, ఉద్దేశపూరకంగా అవమానించారని విమర్శించారు. బీజేపీ నేతలు ఏనాడూ తానా సభలకు హాజరైన సందర్భాలు లేవని, తానా అనేది పూర్తిగా తెలుగుదేశం పార్టీ సంస్థ అని ధ్వజమెత్తారు. తానా సభలు అనేవి క్రమంగా- తెలుగుదేశం పార్టీ ఫ్యామిలీ ఫంక్షన్గా తయారయ్యాయని మండిపడ్డారు.
పవన్ కల్యాణ్, రామ్ మాధవ్.. తొలిసారిగా!
ప్రస్తుతం అమెరికాలో వైభవంగా కొనసాగుతోన్న తానా సభలకు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హాజరయ్యారు. ఆయన ఈ సభలకు హాజరు కావడం ఇదే తొలిసారి. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత పవన్ కల్యాణ్. అందుకే- ఇన్నేళ్లుగా పవన్ కల్యాణ్కు తానా సభల ఆహ్వానం అందలేదనే ఆరోపణ ఉంది. అదే క్రమంలో- రామ్ మాధవ్ కూడా తానా సభల్లో పాల్గొనడం తొలిసారే. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికీ.. టీడీపీతో సంబంధం లేకపోవడం వల్లే ఆయనకూ ఏనాడూ ఆహ్వానం అందలేదని వైఎస్ఆర్ సీపీ నాయకులు విమర్శ. ప్రస్తుత సభలకు ఈ ఇద్దరూ హాజరు కావడం.. కొత్త తరహా రాజకీయ సమీకరణాలను తావిచ్చిందని అంటున్నారు.
బీజేపీని ఎందుకు విమర్శించట్లేదు
ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్దిరోజుల్లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన కీలక నాయకులు సీఎం రమేష్, సుజనా చౌదరి, గరికపాటి రామ్మోహన్ వంటి డైహార్డ్ తెలుగు దేశం నాయకులు బీజేపీ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇంత జరిగినప్పటికీ- చంద్రబాబు నాయుడు ఒక్కసారైనా బీజేపీని విమర్శించలేదు. పైగా- ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తనను టార్గెట్గా చేసుకున్నారని, తనను వెంటాడుతున్నారని ఆరోపిస్తున్నారు. తమ పార్టీ నాయకులను చేర్చుకున్న బీజేపీపై మాటమాత్రంగా కూడా విమర్శలు చేయకుండా- వైఎస్ జగన్పై దుమ్మెత్తిపోయడాన్ని తప్పు పడుతున్నాయి వైఎస్ఆర్ సీపీ శ్రేణులు. తెలుగుదేశం పార్టీ క్రమంగా బీజేపీలో విలీనం అయ్యే అవకాశాలు ఉన్నామని, పవన్ కల్యాణ్, రామ్ మాధవ్ల తానా సభల భేటీ దీనికి సంకేతమనీ అంటున్నారు వైఎస్ఆర్ సీపీ నాయకులు.