పరాజయ కుంపట్లు! టీడీపీలో అసంతృప్తుల గళం! టీడీఎల్పీ ఎన్నిక వాయిదా
అమరావతి: కనీవినీ ఎరుగని విధంగా దారుణంగా పరాజయం పాలైన తెలుగుదేశం పార్టీలో అసంతృప్తుల గళం అప్పుడే వినిపిస్తోంది. బయటికి తెలియకున్నా.. కొంతమంది సీనియర్లు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. స్వయంగా చంద్రబాబు ఫోన్ చేసినప్పటికీ కొందరు సీనియర్లు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది.
పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావు జయంతి వేడుకలను మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించాల్సి ఉంది. ఎన్టీ రామారావు జయంత్యుత్సవాలతో పాటు తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష నేతను కూడా ఎన్నుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో- చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాలకు చెందిన సీనియర్లతో మంతనాలు సాగించారు. టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పొలిట్ బ్యురో సభ్యులతో చర్చించారు.
సీనియర్లు గుర్రు..
ఈ సందర్భంగా చాలామంది సీనియర్లు చంద్రబాబుకు అందుబాటులో రాలేదని తెలుస్తోంది. అశోక గజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, కేఈ కృష్ణమూర్తి, డాక్టర్ ఎన్ శివప్రసాద్ వంటి నాయకులతో పాటు కొందరు పొలిట్బ్యురో సభ్యులు కూడా చంద్రబాబుతో మాట్లాడటానికి నిరాసక్తతను కనపర్చినట్లు తెలుస్తోంది. ఎన్టీ రామారావు జయంత్యుత్సవాల సందర్భంగా లేదా టీడీఎల్పీ నేత ఎన్నిక సమావేశంలో తమ గళాన్ని వినిపించడానికి సన్నాహాలు చేస్తున్నారని చెబుతున్నారు.
ఈ అయిదేళ్ల కాలంలో చంద్రబాబు నాయుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు పార్టీ సీనియర్లకు మింగుడు పడలేదు. గత ఏడాది నవంబర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి మహాకూటమిని ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించారు. చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం పట్ల పార్టీకి చెందిన కొందరు కీలక నేతలు నివ్వరపోయారు. అయినప్పటికీ- తమ గళాన్ని చంద్రబాబు వద్ద వినిపించే సాహసం చేయలేదు.
ఒంటెత్తు పోకడల ప్రభావం..
మాజీ ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు వంటి ఒకరిద్దరు మాత్రమే దీనిపై బహిరంగంగా విమర్శించారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకుంటే తాను ఉరి వేసుకుంటానని కేఈ బహిరంగంగా ప్రకటించారు. అయినప్పటికీ- వారి అభ్యంతరాలను ఏ మాత్రం పట్టించుకున్న పాపాన పోలేదు చంద్రబాబు. తీసుకోవాల్సిన నిర్ణయాన్ని తీసుకున్నారు. పార్టీ నేతలందరూ దానికి కట్టుబడి ఉండాల్సిందేనంటూ హుకూం జారీ చేశారు.
ఎవరిని అడిగి కాంగ్రెస్కు దగ్గరయ్యారు..
కాంగ్రెస్తో పొత్తు పెట్టుకునే విషయంలో చంద్రబాబు ఎవ్వర్నీ సంప్రదించలేదనే విషయం అందరికీ తెలిసిందే. కనీసం పొలిట్ బ్యురోలో కూడా చర్చించలేదని అంటున్నారు. ఇలాంటి కీలక నిర్ణయం తీసుకునే విషయంలో చంద్రబాబు ఒంటెత్తు పోకడలు పోయారని అప్పట్లో సీనియర్ నేతలు వాపోయారు. పార్టీ పుట్టినప్పటి నుంచీ అంటి పెట్టుకుని ఉన్న అశోక గజపతిరాజు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి వంటి నాయకులు తీరిగ్గా చంద్రబాబు విధానాలపై అసహనంగా ఉంటున్నట్లు తెలుస్తోంది.
ఇది యూటర్న్ కాదా..?
ఎన్డీఏ నుంచి బయటికి రావడం, కాంగ్రెస్కు దగ్గర కావడం వంటి పరిణామాలు తెలుగుదేశం పార్టీ పట్ల ప్రజల్లో చులకన భావం ఏర్పడటానికి కారణమైందని చెబుతున్నారు. దీనికితోడు- ప్రత్యేక హోదా వంటి అత్యంత కీలకమైన డిమాండ్ విషయంలో చంద్రబాబులో స్పష్టత లోపించిందని, ఎన్డీఏలో ఉన్నన్ని రోజులు ప్యాకేజీకి జై కొట్టి, బయటికి వచ్చిన వెంటనే హోదా కావలంటూ నాలిక మెలి తిప్పడాన్ని ప్రజలు గమనించారని అంటున్నారు. నరేంద్ర మోడీ అంతటి వాడు లేడని నిండు సభలో ప్రకటించి, తీర్మానం చేసిన చంద్రబాబు నాయుడు.. అదే నరేంద్ర మోడీపై వ్యక్తిగత విమర్శలకు దిగడాన్ని ప్రజలు స్వాగతించలేదనే అభిప్రాయం వారిలో ఉంది.
టీడీఎల్పీ ఎన్నిక 29కి వాయిదా..
నిజానికి- ఎన్టీఆర్ జయంత్యుత్సవం నాడే తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్షం సమావేశం కావాల్సి ఉంది. అదేరోజు టీడీఎల్పీ నాయకుడిని ఎన్నుకోవాల్సి ఉంది. పార్టీలో నెలకొన్న తాజా పరిణామాల పట్ల ఈ భేటీని ఒకరోజుకు వాయిదా వేశారు. 29వ తేదీన ఉదయం 10 గంటలకు చంద్రబాబు నివాసంలో ఈ భేటీ కానుంది. శాసనసభాపక్ష నేత, ఉప నేతల ఎన్నికను నిర్వహిస్తారు. పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున ఎన్టీఆర్ జయంతి కార్యక్రమాన్ని గుంటూరు టీడీపీ కార్యాలయంలో నిర్వహించనున్నారు.
మాజీ మంత్రి గల్లా అరుణ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్య లో మహిళలు వచ్చి ఆయనను కలిశారు. ఎన్నికల్లో పార్టీ ఓటమిపై వారు విచారం వ్యక్తం చేయగా బాబు సముదాయించారు. ప్రజల తీర్పును శిరసావహించాలని, ఏం జరిగిందో అన్నీ విశ్లేషించుకొందామన్నారు. విశాఖ జిల్లాలో గెలిచిన ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, గణబాబు, శ్రీకాకుళం జిల్లా నుంచి గెలిచిన అచ్చెన్నాయుడు తదితరులు కూడా బాబుతో భేటీ అయ్యారు.