జగన్ను దెబ్బకొట్టేందుకు బాబు మరో ఆయుధం!: కొత్త దోస్తీపై వైసీపీలో ఆందోళన?
అమరావతి: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును ఉపయోగించుకొని ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందాలని తెలుగుదేశం పార్టీ యోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏపీకి వచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కేసీఆర్ చెప్పడం, ఇటీవల వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డిని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
కేసీఆర్ గతంలో ఏపీ పైన చేసిన విమర్శలను ఆధారంగా చేసుకొని జగన్ను కార్నర్ చేయాలని టీడీపీ యోచిస్తోందని అంటున్నారు. కేటీఆర్ - జగన్ భేటీతో వారు ఒక్కటేనని తేలిపోయిందని అంటున్నారు. గత కొన్నాళ్లుగా టీడీపీ నేతలు ఆంధ్రా గౌరవం తాకట్టు పెడతారా అంటూ వైసీపీపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పటి వరకు కేసులే జగన్ విషయంలో చంద్రబాబుకు ఉన్న ఆయుధంగా భావించేవారు. ఇప్పుడు తెరాస రూపంలో మరో ఆయుధం దొరికిందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారట.
కేసీఆర్ను టార్గెట్ చేయడం ద్వారా జగన్ను దెబ్బకొట్టే ప్లాన్
వచ్చే ఏపీ అసెంబ్లీ, లోకసభ ఎన్నికల్లో కేసీఆర్ను, తెరాస నేతల వ్యాఖ్యలను టార్గెట్ చేయడం ద్వారా జగన్ను దెబ్బకొట్టవచ్చునని టీడీపీ భావిస్తోందని అంటున్నారు. అందుకే జగన్, కేసీఆర్ స్నేహం, ఆంధ్రా గౌరవం గురించి మాట్లాడుతున్నారని చెబుతున్నారు. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ తెలంగాణ గౌరవం అంటూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని టీడీపీ ఏపీలో అమలు చేస్తోందని అంటున్నారు.
కేటీఆర్ వ్యాఖ్యలు జగన్కు ప్లస్సా?
జగన్తో కేటీఆర్ భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడారు. అప్పటి నుంచి తెరాసను టీడీపీ నేతలు మరింతగా టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో వైసీపీని ఇరకాటంలో పడేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రకు ద్రోహం చేసే వారితో అంటకాగుతారా అని ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక హోదాకు తాము అనుకూలమని తెరాస చెబుతోంది. అంతేకాదు, రెండు రాష్ట్రాలుగా విడిపోయినా, అన్నదమ్ముల్లా కలిసి ఉందామని తాము చెబుతున్నామని కేటీఆర్ సహా తెరాస నేతలు చెబుతున్నారు. తెరాస నేతల వ్యాఖ్యలు జగన్కు ఏ మేరకు ఉపకరిస్తాయని ముందు ముందు తేలనుంది.
కేటీఆర్-జగన్ భేటీ, ఆందోళన?
తెలంగాణ సంపదను ఆంధ్రోళ్లు ఏళ్ల తరబడి దోచుకుతిన్నారు, తెలంగాణ వెనుకబాటుకు ఆంధ్రా పాలకులే కారణం, తెలంగాణ వస్తే హైదరాబాద్ నుంచి ఆంధ్రులను తరిమేస్తాం, పోలవరం కోసం తెలంగాణలోని ఏడు మండలాలను గుంజుకుపోయారు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ నేతలు పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఆంధ్రా బ్రాహ్మణులను, ఆంధ్రా బిర్యాని అంటూ గతంలో అవమానించేలా వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. మరోవైపు, టీడీపీతో మిత్రపక్షంగా మెలుగుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ పరిణామాలు వైసీపీలోని కొందరు నేతలకు మింగుడు పడటం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. వారు ఆందోళనలో ఉన్నారని అంటున్నారు. కేటీఆర్తో భేటీ తర్వాత టీడీపీ విమర్శల దాడి మరింత పెంచడం వైసీపీని ఇరకాటంలో పడేసిందనే వాదనలు వినిపిస్తున్నాయి.
అదే ఆందోళన
రాష్ట్ర విభజనకు కారణమైన పార్టీగా తెరాసను ఏపీ ఇక్కడి ప్రజలు చూస్తున్నారని, అలాంటి పార్టీతో చెలిమిని ప్రజలు సహించరని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయట. ఓ వైపు విభజన సమస్యలు ఇంకా ఉన్నాయని, అలాంటప్పుడు తెరాసతో మిత్రుత్వం అనే అంశం దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. రాష్ట్ర అభివృద్ధికి నిరంతరం అడ్డుపడుతున్న కేసీఆర్తో స్నేహం చేసినా లేదా ఆయన తమ పార్టీకి మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రజలంతా ప్రత్యర్థి పార్టీల వైపు మొగ్గుచూపడం ఖాయమని అంటున్నారట.
గెలుపు ఆశలపై... పరిస్థితులు మారేనా
ఇప్పటి వరకు విజయంపై వైసీపీ కేడర్ ఉత్సాహంతో ఉందని, తెరాసతో కలిసిన తర్వాత పరిస్థితులు మళ్లీ మారిపోతాయనే ఆందోళనలో వైసీపీ ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే వచ్చే ఎన్నికల్లో తెరాసతో పొత్తు ఉండదని, తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఇప్పటికై వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అయితే, తెరాసతో దోస్తీ నష్టం చేస్తుందా అనే చర్చ సాగుతోంది.