మొన్న మద్యం..నిన్న ఎల్జీ పాలిమర్స్: జగన్ సర్కార్పై టీడీపీ లేటెస్ట్ వెపన్ ఇదే: ముప్పేటదాడి
అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై తెలుగుదేశం వరుసబెట్టి దాడులను కొనసాగిస్తోంది. అధికార పార్టీ నాయకులను ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఒకదాని తరువాత ఒకటిగా ఆరోపణాస్త్రాలను సంధిస్తోంది. వారిని ఆత్మరక్షణలోకి నెట్టేస్తోంది. వివరణలను ఇచ్చుకునే ప్రయత్నం చేయడం తప్ప.. ఎదురుదాడికి దిగలేని పరిస్థితిని కల్పిస్తోంది తెలుగుదేశం పార్టీ. టీడీపీ తాజాగా లేవనెత్తిన మరో సామాజిక అంశానికి ప్రభుత్వం మరోసారి వివరణ ఇచ్చుకోవాల్సి వస్తోంది. తప్పకపోవచ్చు.
మొన్న మద్యం రచ్చ..
రాష్ట్రంలో మద్యం దుకాణాలను తెరవడం, వాటి అమ్మకాలను పునఃప్రారంభించడాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ క్యాడర్ మొత్తం తప్పు పట్టింది. ప్రభుత్వ వైఖరిని ఏకిపారేసింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకులందరూ ఏదో ఒకరూపంలో మద్యం అమ్మకాలపై జగన్ సర్కార్పై దండెత్తారు. విమర్శల్లో ముంచెత్తారు. ఆ వివాదం అలా కొనసాగుతుండగానే.. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్స్లో స్టెరిన్ గ్యాస్ వెలువడిన ఉదంతాన్ని అందుకుంది టీడీపీ. ఈ విషయంలో చంద్రబాబు తీవ్రంగా స్పందించారు.
నిన్న ఎల్జీ పాలిమర్స్పై రగడ..
మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోటి రూపాయల ఎక్స్గ్రేషియోను ప్రకటించినప్పటికీ.. సంతృప్తిని వ్యక్తం చేయలేదు. కోటి రూపాయలు ఏం సరిపోతాయంటూ తప్పు పట్టారు చంద్రబాబు. ఐఎఎస్లను కాదని, పార్టీ తరఫు నాయకులతో కమిటీనీ వేశారు. అదే సమయంలో- మృతుల కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన అందజేయడం .. దీనికోసం మంత్రులు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లడం.. విష వాయువుల ప్రభావం ఉన్న గ్రామాల్లో నిద్రించడం వంటి చర్యలతో టీడీపీ విమర్శలకు సమాధానం చెప్పినట్టయింది వైసీపీ.
ఇక కోరింగ మడ అడవులపై
ఈ ఉదంతానికి ప్రభుత్వం పుల్స్టాప్ పెట్టిందనుకుంటోన్న కొన్ని గంటల్లోనే తెలుగుదేశం పార్టీ సరికొత్త అంశాన్ని తెరమీదికి తీసుకొచ్చింది. అదే కోరింగ మడ అడవులు. తూర్పు గోదావరి రక్షణ కవచంలా నిలిచిన కోరింగ మడ అడవులను అంశాన్ని తెలుగుదేశం పార్టీ తన తాజాగా వెపన్లా మార్చుకుంది. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడానికి జగన్ సర్కార్.. ప్రకృతి ప్రసాదించిన కోరింగ మడ అడవులను సైతం ధ్వంసం చేయడానికి వెనుకాడట్లేదని ఆరోపిస్తోంది. దట్టమైన చెట్లతో నిండిన ఓ ఫొటో, పేదలకు ఇళ్ల పట్టాల కోసం దాన్ని నరికి వేశారంటూ మరో ఫొటోను తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తోంది.
Recommended Video
మడ అడవులు విధ్వంసం చేస్తున్నారంటూ..
కోరింగ మడ అడవుల విధ్వంసానికి ప్రభుత్వం పాల్పడుతోందని అంటూ చంద్రబాబు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం ఆయన ఓ ట్వీట్ చేశారు. నాడు.. నేడు పేరుతో రెండు ఫొటోలను ఆయన తన ట్వీట్కు జత చేశారు. కోరింగ మడ అడవులను ఐక్యరాజ్య సమితి సైతం గుర్తించిందని, వాటిని నరికి వేస్తోందని ప్రభుత్వం విమర్శలను గుప్పించారు. కోరింగ మడ అడవులను నరికేసి, మట్టి నింపిందని ఆరోపించారు. కాకినాడకు రక్షణ కవచం లాంటి మడ అడవులను ఇలా నరికేస్తే రేపు తుఫానులొచ్చినప్పుడు ప్రజల సంగతి ఏంటని నిలదీశారు. ఇలాంటి చోట ఇళ్ళు కట్టుకుంటే ఆ పేదలకు రక్షణ ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు.