దెబ్బతీయాలనుకుంటే, జగన్కు బుద్ధి చెప్పారు, మనోళ్లని చంపారు: బాబు
విభజన నేపథ్యంలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు నాటకాలు ఆడాయని, వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. మహానాడు ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
విశాఖ: విభజన నేపథ్యంలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్లు నాటకాలు ఆడాయని, వారికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సోమవారం అన్నారు. మహానాడు ముగింపు సభలో ఆయన మాట్లాడారు.
విభజన సమయంలో మనల్ని దెబ్బతీయాలని చూశారని, కానీ ఓ ప్రాంతానికి అన్యాయం చేయాలని తాను చెప్పలేదన్నారు. కాంగ్రెస్, వైసిపి దెబ్బతీయాలని చూస్తే ప్రజలు వారికి బుద్ధి చెప్పారన్నారు. విశాఖ ప్రజలు చాలా మంచివారు అన్నారు.
గతంలో ఎప్పుడూ జరగనంత అద్భుతంగా ఈసారి మహానాడు జరిగిందన్నారు. టిడిపికి 35 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. పోలవరం నీటిని ఉత్తరాంధ్రకు తరలిస్తామన్నారు.
విశాఖవాసులు ఉక్కు సంకల్పంతో పట్టణాన్ని నెంబర్ వన్గా తీర్చిదిద్దారన్నారు. పార్టీని నిరంతరం కాపాడుకుంటున్నామని, ఇది నా ఒక్కడి గొప్పతనం కాదన్నారు. కార్యకర్తలు ఎన్ని ఇబ్బందులు వచ్చినా వెన్ను చూపలేదన్నారు. ప్రాణాలు పోయినా పార్టీ కోసం పని చేసిన వారున్నారన్నారు.
హైదరాబాద్ను నాలెడ్జ్ హబ్గా..
హైదరాబాదును నాలెడ్జ్ హబ్గా తీర్చిదిద్ది తెలుగుజాతికి అప్పగించామన్నారు. మనం ఓ వైపు సమాజం కోసం పని చేయాలని, రెండోవైపు కార్యకర్తల కోసం పని చేయాలన్నారు. మహానాడు తెలుగు జాతికి, టిడిపికి ఓ పండుగ రోజు అన్నారు.మారిన సమాజంతో పాటు మనమూ మారాలని చంద్రబాబు అన్నారు. కొత్త పార్టీలు వచ్చాయని, కానీ నిలిచే పరిస్థితులు లేవన్నారు. పార్టీలనే కాదని, మనం చిన్నప్పుడు చూసిన కంపెనీలు ఇప్పుడు లేవన్నారు. టిడిపి మాత్రం కొనసాగుతుందని అభిప్రాయపడ్డారు.
సోషల్ మీడియా వచ్చింది..
ప్రింట్ మీడియా తర్వాత ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందని, ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చిందన్నారు. మన సమావేశాన్ని మన దేశంతో పాటు విదేశాల్లో కోటి మంది చూశారన్నారు. ఇలా అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు.
తెలుగుదేశం తెలుగువారి కోసం పెట్టిన పార్టీ అన్నారు. తెలుగు వారు ఎక్కడున్నా వారి అభివృద్ధి కోసం పెట్టిన పార్టీ అన్నారు. ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం ఆదుకుంటుందని, అది మన ఘన చరిత్ర అన్నారు.
కాంగ్రెస్ పార్టీ వల్ల లాభం లేదని చెప్పి, ఆ పార్టీని దెబ్బతీయడానికి జాతీయస్థాయిలో విపక్షాలను కలిపిన ఘనత ఎన్టీఆర్ది అన్నారు.
పరిటాల సహా, టిడిపిపై దాడులు జరిగాయి
సమైక్య ఏపీలో టిడిపి కార్యకర్తలపై దాడులు జరిగాయన్నారు. సాక్షాత్తు ఎమ్మెల్యే అయిన పరిటాల రవిని, ఇతరులను నడిరోడ్డుపై చంపేశారన్నారు. టిడిపి అలాంటి రాజకీయాలకు దూరమన్నారు. హత్యా రాజకీయాలు టిడిపి చేయదన్నారు.
విభజన సమయంలో తాను తన వాదనను స్పష్టంగా చెప్పానన్నారు. తెలుగు జాతికి న్యాయం చేయాలని కోరానని చెప్పారు. హైదరాబాదును నేను నిర్మించానని చంద్రబాబు అన్నారు.తెలుగు వారు అత్యున్నత స్థాయిలో ఉండాలని, అలాగే ఎవరికీ అన్యాయం జరగవద్దన్నారు.
విభజన విషయంలో అన్యాయంగా ముందుకు
కానీ కాంగ్రెస్ పార్టీ అన్యాయంగా విభజన విషయంలో ముందుకు పోయిందన్నారు. హైదరాబాద్ తెలంగాణలో ఉంది కాబట్టి ఏపీ కోలుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని అడిగామన్నారు. బిజెపి కూడా హోదాను అడిగిందన్నారు.
మనం గతంలో వాజపేయి హయాంలోను ఎన్డీయేతో కలిసి ఉన్నామన్నారు. దేశం కోసం మనం ఆలోచించేవాళ్లమని, ఏపీ అభివృద్ధిని ఆలోచించేవాళ్లమని, అందుకే పదవులు తీసుకోకుండా మద్దతిచ్చామన్నారు. ఈసారి కూడా దేశం కోసం మనం ఎన్డీయేతో పొత్తు పెట్టుకున్నామన్నారు.
మోడీ వైపు వన్ సైడ్ ఎన్నికలు
2014లో దేశంలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక కాంగ్రెస్సేతర పక్షానికి ప్రజలు నరేంద్ర మోడీకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చారన్నారు.
వైసిపికి బుద్ధి చెప్పారు
విభజన సమయంలో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. ఈ నాటకాలను ప్రజలు చూసి వైసిపికి, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పారన్నారు.