ఒక అల్లుడు, ఒక మరదలు, ఒక తమ్ముడు..ఇదీ టీడీపీ అభ్యర్థల జాబితా
Recommended Video
అమరావతి: రాజకీయాల్లో బంధుప్రీతి సాధారణమే. బాగా సంపాదించిన, పేరూ ఉన్న నాయకులు తమ కుటుంబీకులను, తమ బంధుగణాన్ని కూడా రాజకీయాల్లో దింపడానికి ప్రయత్నింస్తుంటారు. ఇలా ప్రయత్నించి విజయవంతమైన నాయకుల జాబితా చాలా పెద్దది. ఈ సారి ఎన్నికలు కూడా సామాజిక వర్గం, బంధుగణం, కుటుంబ రాజకీయల చుట్టే తిరుగుతాయని తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పకనే చెప్పారు. కడప జిల్లాలో సగానికి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించారాయన. రాజంపేట లోక్ సభ పరిధిలో అయిదుమంది అభ్యర్థులను ప్రకటించగా.. వారిలో ముగ్గురు రాజకీయ నేపథ్యం ఉన్న కుటంబానికి చెందిన వారే కావడం బంధుప్రీతికి నిదర్శనం.
రాజంపేట లోక్ సభ నియోజకవర్గం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. వాటిల్లో అయిదు స్థానాలకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. రాజంపేట-బీ చెంగల్రాయుడు, పీలేరు-నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి, పుంగనూరు-అనీషా రెడ్డి, రైల్వే కోడూరు-నరసింహ ప్రసాద్, రాయచోటి-రమేష్ కుమార్ రెడ్డిలను నిలబెట్టారు. ఈ అయిదుమందిలో రాజంపేట, రాయచోటిలను వదిలేస్తే.. మిగిలిన ముగ్గురూ రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారే. ఉమ్మడి రాష్ట్రానికి చివరి ముఖ్యమంత్రిగా పేరున్న నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు కిశోర్ కుమార్ రెడ్డికి పీలేరు టికెట్ ఇచ్చారు. ఇది ముందుగా కుదుర్చుకున్న ఒప్పందమే.
తమ్ముడు కిశోర్..
కిశోర్ కుమార్ రెడ్డిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో, కిశోర్ కుమారే చక్రం తిప్పేవారని స్వయంగా తెలుగుదేశం నేతలే విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో కిశోర్ కుమార్ రెడ్డి `జై సమైక్యాంధ్ర పార్టీ` తరఫున పీలేరు నియోజకవర్గం నుంచే పోటీ చేసి, ఓడిపోయారు. కొద్దిరోజుల పాటు క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన.. తెలుగుదేశం పార్టీలో చేరారు. అనంతరం గృహనిర్మాణ సంస్థ ఛైర్మన్ అయ్యారు. 2019 ఎన్నికల్లో తనకు పీలేరు అసెంబ్లీ టికెట్ ఇస్తేనే, పార్టీలో చేరుతానని షరతు పెట్టి మరీ టీడీపీలో చేరారు. ప్రస్తుతం పీలేరు నియోజకవర్గం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. చింతల రామచంద్రా రెడ్డి ఇక్కడి ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో చింతల రామచంద్రా రెడ్డి.. కిశోర్ కుమార్ రెడ్డిపై సుమారు 15 వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. టీడీపీ ఇక్కడ మూడో స్థానంలో నిలిచింది. నియోజకవర్గం రాజకీయాలపై కిశోర్ కుమార్ రెడ్డికి గట్టి పట్టు ఉంది.
మరదలు అనీషా
తెలుగుదేశం పార్టీ పుంగనూరు బరిలో దింపిన అనీషా రెడ్డి మరెవరో కాదు. భారీ పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డికి స్వయానా మరదలు. రాజకీయాలకు పూర్తిగా కొత్త. పొరుగునే బెంగళూరు కేంద్రంగా అనీషారెడ్డి కుటుంబం వ్యాపారాలను నిర్వహిస్తోంది. నియోజకవర్గ ప్రజలకు కూడా పెద్దగా పరిచయం లేని పేరనే చెబుతున్నారు. పుంగనూరు టికెట్ తనకు లభిస్తుందని ముందస్తు సమాచారం ఉండటం వల్ల కొద్దిరోజులుగా ఆమె నియోజకవర్గంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఈ స్థానానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. 2014 ఎన్నికల్లో పెద్దిరెడ్డి.. 31 వేలకు పైగా ఓట్ల భారీ మెజారిటీతో టీడీపీ అభ్యర్థి వెంకటరమణ రాజుపై గెలిచారు. రాజకీయాల్లో తలపడింన పెద్దిరెడ్డిని అనీషా ఎలా పోటీ ఇస్తారనేది ఆసక్తికర అంశం.
అల్లుడు నరసింహ ప్రసాద్..
తెలుగుదేశం పార్టీకి చెందిన చిత్తూరు లోక్ సభ సభ్యుడు, నటుడు ఎన్ శివప్రసాద్ అల్లుడే ఈ నరసింహ ప్రసాద్. ఆయనకు కడపజిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. తన కుమార్తెకు పెద్దగా ఇష్టం లేకపోయినా శివప్రసాద్ దగ్గరుండి, ఆమెను ఒప్పించి ఈ టికెట్ అల్లుడికి వచ్చేలా చేశారనే టాక్ ఉంది. నరసింహ ప్రసాద్ కూడా రాజకీయాలకు కొత్తే. అయినప్పటికీ- తరచూ మామ శివప్రసాద్ కార్యకలాపాల్లో పాలుపంచుకునే వాడని చెబుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులుపై పోటీగా టీడీపీ ఆయనను బరిలో దింపింది. 2009, 2014 ఎన్నికల్లో కొరుముట్ల విజయం సాధించారు. నరసింహ ప్రసాద్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై రైల్వే కోడూరు టీడీపీలో అసంతృప్తి వ్యక్తమౌతోంది. ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం ఎంత మేర కృషి చేస్తారనేది ప్రశ్నార్థకమే.