టీడీపీ ఆవిర్భావ దినోత్సవం: ఏపీ ప్రజలకు హైదరాబాద్ నుంచి చంద్రబాబు సందేశం: ఇంట్లోనే ఉండాలంటూ..!
అమరావతి: అవిభాజ్యం ఆంధ్రప్రదేశ్లో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన తెలుగుదేశం పార్టీ ఆదివారం 39వ ఆవిర్భావి దినోత్సవాన్ని జరుపుకొంటోంది. విభజన తరువాత కూడా ఏపీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మొట్టమొదటి అధికార పార్టీగా టీడీపీ చరిత్రను సృష్టించింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన ఆ పార్టీ.. ఎన్నో ఆటుపోట్లను చవి చూసింది..సంక్షోభ సమయాలను ధీటుగా ఎదుర్కొంది.
Recommended Video
కరోనా అరికట్టటానికి చిట్కాలు చెప్పిన నారా లోకేష్ ..ఏం చెప్పారంటే
ప్రజలను ఆదుకున్న ఘనత తమదే..
ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్లోని తన ఇంట్లో ఉంటోన్న ఆయన.. పార్టీ అధికారంలో ఉన్న సమయంలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ట్విట్టర్ ద్వారా ఏపీ ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో తాము వేలాదిమంది ప్రజలను గడ్డు పరిస్థితుల నుంచి కాపాడగలిగామని అన్నారు.
మహనీయుల స్ఫూర్తితో..
కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ వంటి మహనీయుల స్ఫూర్తితో నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని చంద్రబాబు గుర్తు చేశారు. కరోనా నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఇళ్ళలోనే జరుపుకోవాలని సూచించారు. ప్రతి నాయకుడు, కార్యకర్త తమ ఇళ్లపై పసుపురంగు పార్టీ జెండాలను ఎగురవేయాలని పిలుపునిచ్చారు. పార్టీని స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారాన్ని అందుకుని, సరికొత్త చరిత్రను సృష్టించిన ఎన్టీ రామారావు చిత్రపటానికి నివాళి అర్పించాలని సూచించారు.
విపత్కర పరిస్థితులను ఎదుర్కొన్నాం..
ప్రభుత్వంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా రాష్ట్ర ప్రజలను సంక్షోభాల నుంచి గట్టెక్కించిన ఘనత తమకు ఉందని చంద్రబాబు చెప్పారు. ఉత్తరాఖండ్లో వరదలు సంభవించినప్పుడు అక్కడ చిక్కుకుపోయిన వందలాది మంది తెలుగు ప్రజలను సురక్షితంగా స్వస్థలానికి తీసుకువచ్చిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. హుద్హుద్, తిత్లీ తుఫానులు వంటి ఎన్నో విపత్తుల్లో ప్రజానీకానికి పార్టీ అండగా నిలిచిందని చెప్పారు.
కరోనాను ఎదుర్కొందాం..
విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకున్న అనుభవం తమకు ఉందని, అదే స్ఫూర్తితో ప్రస్తుత కరోనా విపత్తులోనూ ప్రజలకు అండగా నిలవాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు సూచించారు. కరోనా వైరస్ విస్తరించిన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల్లో ధైర్యాన్ని నింపాలని, ఎన్టీఆర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలని అన్నారు. కరోనాను ధీటుగా ఎదుర్కొవాలని చెప్పారు. లాక్డౌన్ విధించినందు వల్ల పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎవ్వరూ బయటికి రావొద్దని, ఇళ్లల్లోనే ఆవిర్భావ దినోత్సవాలను జరుపుకోవాలని చెప్పారు.