ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు మెదడు మోకాల్లో ఉందట!
అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్ మరోసారి విరుచుకుపడ్డారు. అన్న క్యాంటీన్ల మూసివేత వ్యవహారాన్ని అడ్డుగా పెట్టుకుని వైఎస్ జగన్ పై ధ్వజమెత్తుతున్నారు. ముఖ్యమంత్రి మోకాలి నిర్ణయాలను తీసుకుంటున్నారని మండిపడ్డారు. ఇలాంటి తలా, తోక లేని నిర్ణయాల వల్ల పేదలకు అందే కూడు పోతోందని నారా లోకేష్ వాపోయారు. అన్న క్యాంటీన్ల సిబ్బంది ఉపాధిని కోల్పోయి వీధిన పడ్డారని విమర్శించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల జేబులు నింపడంపై ఉన్న శ్రద్ధ వైఎస్ జగన్ కు సామాన్య ప్రజలపై లేదని ఆరోపించారు. పేదల ప్రభుత్వం అని చెప్పుకొంటోన్న ప్రభుత్వం.. అదే పేదల పొట్ట కొడుతోందని అన్నారు.
భారత భూభాగంపైకి చొచ్చుకొచ్చిన ఉగ్రవాదులు!
లోకేష్ ను కలిసిన అన్న క్యాంటీన్ ఉద్యోగులు..
అన్న క్యాంటీన్లలో పనిచేస్తోన్న పలువురు సిబ్బంది మంగళవారం రాజధాని అమరావతి ప్రాంతంలోని నివాసంలో నారా లోకేష్ ను కలుసుకున్నారు. వినతిపత్రాన్ని అందజేశారు. అన్న క్యాంటీన్ ఉద్యోగుల బాధిత సంఘం పేరుతో వారు ప్రత్యేక అసోసియేషన్ ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ అసోసియేషన్ అధ్యక్షుడు పీ వెంకటేష్ బాబు, ప్రధాన కార్యదర్శి అడపా ప్రదీప్ ల నేతృత్వంలో పలువురు సిబ్బంది నారా లోకేష్ ను కలిశారు. తెలుగుదేశం పార్టీ నెలకొల్పిన అన్న క్యాంటిన్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మూసి వేసిందని అన్నారు. దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన లక్షల మంది ఉపాధి కోల్పోయారని అన్నారు. ప్రస్తుతం తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పారు.
Recommended Video
మీరు అన్నం పెట్టారు.. వాళ్లు పొట్ట కొట్టారు..
గత సంవత్సరం రాష్ట్రంలో 210 అన్న క్యాంటిన్లను తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, దీని ద్వారా ఎంతోమంది పేద ప్రజలకు చంద్రబాబు దేవుడిగా మారాడని అన్నారు. ప్రతిరోజూ 2,10,000 మందికి ఈ క్యాంటీన్ల ద్వారా కడుపు నిండా భోజనం పెట్టారని అన్నారు. అలాంటి అన్న క్యాంటిన్లను కిందటి నెల 31వ తేదీన మూసివేశారని చెప్పారు. రాజకీయ దురుద్దేశంతోనే వాటికి తాళాలు వేశారని అన్నారు. అన్న క్యాంటిన్లు మూసివేయడం లేదని హామీ మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీ సమావేశాలలో ఇచ్చినప్పటికీ.. అది అమలు కాలేదని అన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాష్ట్రవ్యాప్తంగా క్యాంటిన్లు మూసివేయడం ద్వారా అన్న క్యాంటిన్లలో పనిచేస్తోన్న 20 వేల మంది కార్మికులు రోడ్డున పడ్డారని వారు వాపోయారు. తమ కుటుంబాలన్నీ రోడ్డున పడినాయని ఆవేదన వ్యక్తం చేశారు. వాటిని పునరుద్ధరించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకుని రావాలని కోరారు.
ముఖ్యమంత్రివన్నీ మోకాలి నిర్ణయాలు..
దీనిపై నారా లోకేష్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అనాలోచిత నిర్ణయాలను తీసుకుంటున్నారని అన్నారు. ఆయనకు మెదడు మోకాలిలో ఉందని ఎద్దేవా చేశారు. వైఎస్ జగన్ తీసుకునే మోకాలి నిర్ణయాలవల్ల పేదలు ఆకలితో అలమటిస్తున్నారని చెప్పారు. అన్నక్యాంటీన్లలో పనిచేస్తోన్న సామాన్యులకు ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై ఉన్న ప్రేమ, సామాన్యులపై లేదా అని నిలదీశారు. నాలుగు లక్షల ఉద్యోగాల కల్పన అని చెప్తూనే రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షలమంది ఉపాధికి గండి కొట్టారని అన్నారు. ఈ విషయంలో వైఎస్ జగన్ ను మెచ్చుకుని తీరాల్సిందేనని నారా లోకేష్ చురకలు అంటించారు. అన్న క్యాంటీన్లలో అవినీతి చోటు చేసుకుందనే సాకును చూపిస్తూ, వాటిని మూసివేయడం వల్ల పేదలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, వాటిని వెంటనే తెరవాలని డిమాండ్ చేశారు.