పోలింగ్ ముంగిట్లో టీడీపీకి దెబ్బమీద దెబ్బ! దుశ్శకునంగా భావిస్తున్న పార్టీ శ్రేణులు
అమరావతిః ఒక్కరోజు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే..కొన్ని గంటల వ్యవధిలో తెలుగుదేశం కొన్ని చేదు సంఘటనలను చవి చూసింది. ఎన్నికల ముంగిట్లో, పోలింగ్ గడువు సమీపించిన ప్రస్తుత తరుణంలో ఈ ఘటనలు చోటు చేసుకోవడాన్ని తెలుగుదేశం నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దుశ్శకునంగా భావిస్తున్నారు. దీని ఆధారంగా- ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేది విశ్లేషించుకుంటున్నారు. ఆ ఘటనలే- ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గాదె శ్రీనివాసలు నాయుడు ఘోరంగా ఓటమి పాలు కావడం, ఎమ్మెల్యే అభ్యర్థి జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం, టీడీపీకి నమ్మినబంటుగా ప్రతిపక్ష నాయకుల నుంచి ఆరోపణలు ఎదుర్కొన్న ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ ఏబీ వెంకటేశ్వర రావుపై ఎన్నికల కమిషన్ బదిలీ వేటు వేయడం. ఆయనతో పాటు మరో ఇద్దరు ఎస్పీలను కూడా ఎన్నికల సంఘం బదిలీ చేసింది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ వారికి పోస్టింగ్ ఇవ్వకూడదని ఆదేశించింది.
టీడీపీ ఉత్తరాంధ్ర కోట బీటలు వారుతోందా?
ఈ మూడూ- కొన్ని గంటల వ్యవధిలో ఒకదాని వెంకట ఒకటి చకచకా చోటు చేసుకున్నాయి. ఇలాంటి ఫలితాలు వస్తాయని బహుశా టీడీపీ నాయకులు ఎవ్వరూ ఊహించి ఉండకపోవచ్చు. గాదె శ్రీనివాసులు ఓటమి, జనార్ధన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణ ఉదంతాలకు లింక్ చేస్తూ ఓ చిన్న థ్రెడ్ ఉంది. అదే- ఈ రెండు చేదు ఫలితాలు ఉత్తరాంధ్రలోనివే కావడం, ఆ ప్రాంతం దశాబ్దాలుగా టీడీపీకి కంచుకోట కావడం. ఒకవంక మంగళగిరి టీడీపీ అభ్యర్థి, స్వయానా ముఖ్యమంత్రి కుమారుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, మరోవంక అనంతపురం జిల్లాలో పార్టీ కీలక నేత, మంత్రి కాల్వ శ్రీనివాసులు నామినేషన్ల వ్యవహారం తేలకపోవడం వంటి ఉదంతాలు దీనికి అదనంగా తోడయ్యాయి. దీనితో టీడీపీ నాయకులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
హ్యాట్రిక్ విజయంపై కన్నేసి..
ఉత్తరాంధ్రలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన గాదె శ్రీనివాస రావు ఘోరంగా పరాజయం పాలయ్యారు. గతంలో రెండు సార్లు ఎమ్మెల్సీగా గెలిచిన ఆయన ఈ సారి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయారు. వరుసగా మూడోసారి నెగ్గి హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన గాదె..తన సమీప ప్రత్యర్థి పాకలపాటి రఘువర్మ చేతిలో పరాజయం చవి చూశారు. మొత్తం ఓట్లలో రఘు వర్మకు 7834 మొదటి ప్రాధాన్యత ఓట్లు రాగా.. గాదె శ్రీనివాస రావుకు 5632 మొదటి ప్రాధాన్యత ఓట్లు వచ్చాయి. విజయనగరం జిల్లా కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున బరిలో నిలిచిన జనార్థన్ థాట్రాజ్ నామినేషన్ తిరస్కరణకు గురి కావడం కూడా అనూహ్య పరిణామమే.
ఫ్యాన్ స్వీచ్ మోదీ, రెగ్యులేటర్ కేసీఆర్ : లోకేశ్ విసుర్లు
సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని దాచి పెట్టారా?
థాట్రాజ్ దాఖలు చేసిన నామినేషన్ పత్రాలను తిరస్కరించారు ఎన్నికల రిటర్నింగ్ అధికారి. నామినేషన్ లో భాగంగా ఎన్నికల అఫిడివిట్ లో దాఖలు చేసిన కుల ధృవీకరణ పత్రం పై బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజు అభ్యంతరం వ్యక్తం చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిజానికి- థాట్రాజ్ ఎస్టీ కాదంటూ ఏడేళ్ల కిందటే అంటే.. 2012లోనే అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీన్ని సవాలు చేస్తూ, థాట్రాజ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్కడా ఆయనకు చుక్కెదురైంది. థాట్రాజ్ ఎస్టీ కాదనే విషయంపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు 2014లో తీర్పు ఇచ్చింది. ఈ రెండు తీర్పులను పక్కన పెట్టేశారాయాన. తాను ఎస్టీ అని ధృవీకరిస్తూ ఓ అఫిడవిట్ ను నామినేషన్ పత్రాలతో జత చేశారు. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను జనార్ధన్ థాట్రాజ్ పట్టించుకోకుండా, నామినేషన్ దాఖలు చేయడం, పైగా- అఫిడవిట్ ను రూపొందించడం దుమారం రేపుతోంది.
బీజేపీ అభ్యర్థి అభ్యంతరం..
తన కుల ధృవీకరణపై జనార్థన్ థాట్రాజ్ తప్పుడు అఫిడవిట్ ఇచ్చారంటూ కురుపాం బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్ రిటర్నింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు, సుప్రీంకోర్టు దాఖలు చేసిన ఉత్తర్వులను ఆయన సాక్ష్యంగా చూపించారు. వాటిని పరిశీలించిన అనంతరం రిటర్నింగ్ అధికారులు థాట్రాజ్ నామినేషన్ ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో థాట్రాజ్ తల్లి నర్సింహ ప్రియా థాట్రాజ్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రస్తుతం కురుపాం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ చేతిలో ఉంది.