గిడ్డి ఈశ్వరి చేరిక, సొంత పార్టీ నేతలకు బాబు షాక్: అది తెలిసే బీజేపీకి టిక్కెట్
విశాఖపట్నం: పాడేరు శాసన సభ్యురాలు గిడ్డి ఈశ్వరి ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆమెను చేర్చుకోవడం ద్వారా నియోజకవర్గంలో మళ్లీ పాతవైభవం వస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. గతంలో ఈ నియోజకవర్గానికి టీడీపీ కంచుకోట. ఇప్పుడు మళ్లీ అక్కడ జెండా పాతాలని భావిస్తోంది.
వైయస్ జగన్ పాదయాత్రలో విద్యార్థులు పని చేస్తున్నారా?
ఇప్పటికే ఎమ్మెల్యే పార్టీలో చేరారు. ఆమెకు తోడు పార్టీని కూడా వచ్చే ఎన్నికల నాటికి టీడీపీ సమాయత్తం చేస్తోంది. ఎన్నికల నాటికి నియోజకవర్గంలో అంతటా టీడీపీ జెండా ఎగరేలా వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యే చేరికకు ముందే చంద్రబాబు పాడేరు నియోజకవర్గ త్రిసభ్య కమిటీ సభ్యులైన మణికుమారి, నాగరాజు, ప్రసాద్లను పిలిపించి సూచనలు చేశారు.
ఆమె చేతుల్లోకి, గిడ్డి ఈశ్వరి వచ్చాక ఇలా.. బాబు ఆదేశం
అభివృద్ధిని చూసి మరో పార్టీ నుంచి ఎవరు వచ్చినా స్వాగతం పలికి వారితో కలిసి పని చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశారని సమాచారం. ఎమ్మెల్యే చేరిక తర్వాత సీనియర్ నాయకులు ఏకతాటి పైకి రావాలని చంద్రబాబు సూచించారు. మరోవైపు పార్టీలో ఎమ్మెల్యే చేరికతో నియోజకవర్గ బాధ్యతలన్నీ ఆమె చేతుల్లోకి వెళతాయని వారికి ముందే చెప్పారని తెలుస్తోంది.
త్రిసభ్య కమిటీని రద్దు చేయొచ్చు
కాబట్టి ముందు ముందు ప్రస్తుతం వ్యవహరిస్తున్న త్రిసభ్య కమిటీని రద్దు చేసే యోచనలో కూడా పార్టీ అధినాయకత్వం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇప్పటి వరకు ఉన్న త్రిసభ్య కమిటీ నేతలు కూడా ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరితో కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఆమెకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పైన ఇప్పటికే చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో వచ్చే ఎన్నికల నాటికి ఆశలు పెట్టుకున్న వారికి అడియాసే.
ఇలా ప్రాభవం కోల్పోయిన టీడీపీ
టీడీపీ నుంచి గతంలో రెండుసార్లు దివంగత చిట్టినాయుడు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఓసారి మాజీ మంత్రి మణికుమారి గెలిచారు. పొత్తుల్లో భాగంగా ఒక ఎన్నికల్లో సీపీఐకి టీడీపీ మద్దతు తెలిపింది. 2004 ఎన్నికల ముందు వరకూ పాడేరులో టీడీపీకి పట్టు ఉంది. 2004లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడంతో అప్పటి నుంచి టీడీపీ పట్టు కోల్పోయింది. నాయకత్వ సమస్య కూడా తలెత్తింది.
పట్టులేదని తెలిసి బీజేపీకి ఇచ్చిన బాబు
ఒకరిద్దరు నాయకులు మాత్రమే పార్టీని నడిపిస్తూ వచ్చారు. పార్టీకి సరైన నాయకత్వం లేకపోవడంతో 2009లో టీడీపీ ఓడిపోయింది. దీంతో చంద్రబాబు పొత్తుల్లో భాగంగా 2014 ఎన్నికల్లో బీజేపీకి కేటాయించారు. దీంతో పార్టీ శ్రేణుల్లో మరింత నిరుత్సాహం కనిపించింది. ఉన్నవారిలో కూడా గ్రూపులు ఉన్నాయి. నియోజకవర్గ ఇంచార్జ్ బాధ్యతలు సైతం ఏ ఒక్కరికి అప్పగించే పరిస్థితులు కనిపించలేదు. దీంతో పార్టీ కార్యక్రమాల కోసం త్రిసభ్య కమిటీని నియమించారు.
ఆ సమయంలో టీడీపీలోకి గిడ్డి ఈశ్వరి
ఈ సమయంలో వైసీపీ నుంచి గెలిచిన, నియోజకవర్గంలో బలమైన కేడర్ ఉన్న గిడ్డి ఈశ్వరి టిడిపిలోకి వచ్చారు. గిడ్డి చేరికపై నియోజకవర్గంలోను ఎక్కువ మంది సంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. 2019 అద్భుత విజయం సాధించాలని టీడీపీ భావిస్తోంది.