పోలీసుల దౌర్జన్యంపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు: కేంద్రమంత్రులతో టీడీపీ ఎంపీలు: ఇక జాతీయ స్థాయిలో..!
న్యూఢిల్లీ: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిపై తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యులు జాతీయ స్థాయిలో ఉద్యమాన్ని చేపట్టారు. మూడు రాజధానుల ఏర్పాటు వ్యవహారం, ఏపీ వికేంద్రీకరణ బిల్లు, శాసన మండలిని రద్దు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేయడం వంటి పలు అంశాలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్తున్నారు. లోక్సభ బడ్జెట్ సమావేశాల మూడోరోజు నుంచే ఈ ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తరచూ కేంద్రమంత్రులందరినీ కలిసే ప్రయత్నం చేయాలని నిర్ణయించారు.
Sailajanath: రాహుల్ గాంధీ దృష్టికి రాష్ట్ర వ్యవహారాలు: జగన్ సర్కార్ వైఖరిపై ప్రజా పోరాటం..!
స్పీకర్ ఓం బిర్లా సహా కేంద్రమంత్రులతో..
మూడు రాజధానులను ఏర్పాటు చేస్తూ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా అమరావతి ప్రాంత రైతులు చేపట్టిన నిరసన దీక్షలు, ఆందోళనల అంశాన్ని వారు కేంద్రమంత్రులు పీయూష్ గోయెల్, సదానంద గౌడ దృష్టికి తీసుకెళ్లారు. అమరావతి నిర్మాణానికి రైతులు 33 వేల ఎకరాలను ఇచ్చారని, అలాంటి వారిపై వైఎస్ జగన్ సహా పలువురు రాష్ట్ర మంత్రులు పెయిడ్ ఆర్టిస్టులంటూ కించపరిచారని ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయాలను తీసుకుంటున్నారని, కేంద్ర ప్రభుత్వాన్ని సైతం లెక్క చేయట్లేదని పేర్కొన్నారు.
ప్రధాని శంకుస్థాపన చేసిన అమరావతిని కాదని..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసిన అమరావతి ప్రాంతాన్ని కాదని.. వైఎస్ జగన్ మూడు రాజధానుల ఏర్పాటుకు పూనుకుంటున్నారని విమర్శించారు. ఆ రకంగా ఆయన ప్రధాని నిర్ణయాన్ని ధిక్కరించారని చెప్పారు. వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించిందనే ఏకైక కారణంతో ఏకంగా శాసన మండలినే రద్దు చేయడానికి వైసీపీ ప్రభుత్వం పూనుకుందని అన్నారు. ఈ బిల్లుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదింపజేయొద్దని విజ్ఙప్తి చేశారు.
పోలీసుల దౌర్జన్యంపై లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు..
అమరావతి ప్రాంత రైతులు, పరిరక్షణ పోరాట కమిటీ నాయకుల ఆందోళనల సందర్భంగా పోలీసులు.. తనపై దౌర్జన్యానికి పాల్పడ్డారని గల్లా జయదేవ్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ఫిర్యాదు చేశారు. తనపై దాడి చేసిన పోలీసులపై చర్యలు చేపట్టాలని విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు ఆయన స్పీకర్కు వినతిపత్రాన్ని అందజేశారు. లోక్సభ సభ్యుడినని కూడా చూడకుండా రైతులకు మద్దతుగా ఉద్యమించిన తనపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, చొక్కాను చింపి వేశారని అన్నారు.
ఫొటోలతో సహా..
ఈ సందర్భంగా స్పీకర్కు వినతిపత్రంతో పాటు కొన్ని ఫొటోలు, వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కథనాల క్లిప్పింగులను అందజేశారు. పోలీస్ స్టేషన్లో తనను నిర్బంధించారని, రాత్రంతా పోలీసులు తమ వాహనాల్లో తిప్పారని చెప్పారు. ఏపీలో పోలీసుల రాజ్యం నడుస్తోందని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన వారిని జగన్ సర్కార్.. పోలీసు సహాయంతో అణచి వేస్తోందని ఫిర్యాదు చేశారు. ఏపీలో శాంతిభద్రతలను గాడిలో పెట్టడానికి తక్షణ చర్యలు తీసుకునేలా చేయాలని కోరారు.