నేడే మంగళగిరిలో టీడీపీ నూతన ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం..
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కొత్త కార్యాలయాన్ని నేడు పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రారంభోత్సవం చేయనున్నారు. మంగళగిరిలో భారీ ఎత్తున నిర్మించిన ఈ కార్యాలయంలో నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు పలు పూజలు నిర్వహించారు. శుక్రవారం ఉదయం 10.03 గంటలకు ప్రారంభోత్సవానికి ముహూర్తంగా నిర్ణయించారు. పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానుల మధ్య అంగరంగవైభవంగా ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నామని, ప్రతీ ఒక్కరూ కుటుంబ సమేతంగా హాజరై, ఈ శుభసందర్భంలో పాలుపంచుకోవాలని టీడీపీ అధినేత ఇప్పటికే ఆహ్వానం పంపారు.
మంగళగిరిలో టీడీపీ పార్టీ కార్యాలయం
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు గ్రామపరిధిలో చేపట్టిన పార్టీ కార్యాలయం నిర్మాణం పూర్తి అయింది. పార్టీ అవసరాల కోసం, మూడు బ్లాకులుగా సౌకర్యవంతంగా కార్యాలయం డిజైన్ చేశారు. ముందుగా ఒక బ్లాక్ ను సిద్దం చేసి... పార్టీ ప్రధాన కార్యాలయాన్ని ఇక్కడ నుంచి నిర్వహించనున్నారు. ప్రభుత్వం కేటాయించిన భూమిలో మొత్తం రెండున్నర లక్షల ఘనపుటడుగుల విస్తీర్ణంలో టీడీపీ కేంద్ర పార్టీ కార్యాలయం నిర్మాణాలు చేపట్టింది.
అధికారం కోల్పోయిన తర్వాత ఇబ్బందుల్లో టీడీపీ
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారం కొల్పోయిన తర్వాత టీడీపీ పార్టీపరంగా కార్యకలాపాలు నిర్వహించేందుకు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోంది. అంతకుముందు అధికారంలో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు తన ఇంటితో పాటు ప్రజావేదికలో పార్టీ కార్యాకలాపాలు నిర్వహించేవారు. ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యాకలాపాల కోసం ప్రజావేదికను ఇవ్వాలని కోరగా అందుకు ప్రభుత్వం నిరాకరించి దాన్ని పూర్తిగా కూల్చి వేసింది. ఇక అధికారం కల్పోవడంతో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
అన్ని హంగులతో మంగళగిరి కార్యాలయం
ఈ నేపథ్యంలోనే గుంటూరులోని కార్యాలయం నుండే చంద్రబాబు పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే కొంత స్థలం ఇబ్బందిగా ఉండడం, రవాణాకు కూడ ఇబ్బందులు ఉండడంతో మంగళగిరి కార్యాలయానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నిర్మాణంలో భాగంగా మొదటి బ్లాక్ పూర్తి చేశారు. ఇక పార్టీ కార్యాలయ నిర్మాణం కోసం తన ప్రభుత్వ హయాంలోనే టీడీపీ భూమిని లీజుకు తీసుకుంది. ప్రస్తుతం నిర్మిస్తున్న కార్యాలయం హైవేకు అనుకుని ఉండడం, విజయవాడ నగరానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో పార్టీ నాయకులకు, కార్యకర్తలకు చాల సౌకర్యవంతంగా ఉండనుంది.