Chandrababu: హ్యాపీ బర్త్ డే అద్వానీజీ: బీజేపీ కురువృద్ధుడికి చంద్రబాబు పుట్టినరోజు శుభాకాంక్షలు..!
అమరావతి: భారతీయ జనతాపార్టీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ శుక్రవారం 92వ జన్మదినాన్ని జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. వారంతా స్వయంగా అద్వానీ నివాసానికి వెళ్లారు. తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అద్వానీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఆయురారోగ్యాలతో అద్వానీ జీవించాలని అకాంక్షించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.
రాష్ట్రపతి పాలన పేరుతో బీజేపీ బెదిరింపులు: విపక్ష ఎమ్మెల్యేలకు కోట్లు ఎర..!
1927 నవంబర్ 8వ తేదీన అద్వానీ అఖండ భారతావనిలోని కరాచీలో జన్మించారు. దేశ విభజన చోటు చేసుకున్న అనంతరం ఆయన కుటుంబం భారత్ కు వలస వచ్చింది. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయితో కలిసి భారతీయ జనతాపార్టీని అభేద్యంగా తీర్చిదిద్దారు. బీజేపీ ఇప్పుడు ఈ స్థాయికి చేరుకుందంటే అందులో అద్వానీ పాత్ర 70 శాతానికి పైగా ఉంటుంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. తన పదవీ కాలంలో కాంగ్రెస్ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశారు. ఉక్కు మనిషిగా పేరు తెచ్చుకున్నారు.
అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఆయన అన్ని రాష్ట్రాల్లో రథయాత్ర చేపట్టారు. హిందువుల ఆరాధ్యదైవం శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించాలనే అకాంక్షను రగిలించగలిగారు. రామమందిర నిర్మాణం పేరుతో అద్వానీ చేపట్టిన రథయాత్రకు దేశం మొత్తం స్పందించింది. బీజేపీకి వెన్నుదన్నుగా నిలుస్తూ వచ్చింది. అటల్ బిహారీ వాజ్ పేయి మంత్రివర్గంలో ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన క్రమంగా పార్టీలో నిరాదరణకు గురయ్యారనే అభిప్రాయాలు ఉన్నాయి.
Heartfelt birthday wishes to Sri LK Advani ji! May you be in good health for many more years to come!!#LkAdvani
— N Chandrababu Naidu (@ncbn) November 8, 2019