పులివెందుల గూండాలు, వైసీపీ పెయిడ్ బ్యాచ్ అరాచకం: చంద్రబాబుపై దాడి వారి పనే: టీడీపీ సీనియర్లు..!
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై విశాఖపట్నం విమానాశ్రయం వద్ద గురువారం చోటు చేసుకున్న దాడి పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు మండిపడుతున్నారు. ఈ దాడి వెనుక పులివెందుల గూండాలు, అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పెయిడ్ బ్యాచ్ కార్యకర్తలు ఉన్నారని ఆరోపించారు. పులివెందుల, కడప, రాయలసీమ జిల్లాల్లోని ఫ్యాక్షన్ సంస్కృతిని ఉత్తరాంధ్రకు పరిచయం చేస్తున్నారని విమర్శించారు.
తిరుమలలో రాపాక: జగన్ పాలనపై అదే వైఖరి..అవే కామెంట్లు: సొంత పార్టీని ఎలా మర్చిపోతానంటూ.. !
దాడి పట్ల భగ్గుమన్న సీనియర్లు..
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ విప్ కూన రవికుమార్, ఆర్టీసీ మాజీ ఛైర్మన్ వర్ల రామయ్య, మాజీమంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు స్పందించారు. గుంటూరులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబుపై దాడి చేయడాన్ని తప్పు పట్టారు. అధికార పార్టీ నాయకులు విష సంస్కృతిని పెంచి పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
శాంతియుత యాత్రపై దాడులా?
చంద్రబాబు నాయుడు శాంతియుతంగా ప్రజా చైతన్య యాత్రలను కొనసాగిస్తున్నారని, వాటిని అడ్డుకోవడానికి అధికార వైఎస్ఆర్సీపీ నాయకులు ఎన్ని ప్రయత్నాలు చేయాలో.. అన్నీ చేస్తున్నారని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రతిపక్ష నేత చంద్రబాబుపై దాడులు చేయడానికి ప్రోత్సహిస్తోందని అన్నారు. వైఎస్ జగన్ కనుసన్నలతోనే వైసీపీ పెయిడ్ బ్యాచ్ ఈ దాడి చేశారని వర్ల రామయ్య మండిపడ్డారు. పోలీసు ఉన్నతాధికారులను తన నివాసానికి పిలిపించి మరీ.. దాడులకు జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు.
టీడీపీ వైపు జనం మొగ్గు..
ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల అనుకూల పవనాలు ఆరంభం అయ్యాయని, దాన్ని గమనించిన ప్రభుత్వం రగిలిపోతోందని ఆరోపించారు. ఈ కారణంతోనే పింఛన్లను రద్దు చేస్తోందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలను తీసుకుంటున్నారని, ఉత్తరాంధ్ర ప్రజలు కూడా విశాఖపట్నాన్ని రాజధానిగా మార్చడాన్ని స్వాగతించట్లేదని కూన రవికుమార్, వర్ల రామయ్య అన్నారు.
విశాఖపట్నంలో భారీ ఎత్తున భూములు కబ్జా..
విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ నాయకులు భారీ ఎత్తున భూములను కబ్జా చేశారని, అందుకే ఆ పార్టీ నాయకులు అక్కడ రాజధానిని ఏర్పాటు చేయాలని కుట్ర పన్నారని టీడీపీ నాయకులు విమర్శించారు. దీనికి సంబంధించిన ఓ జాబితాను కూన రవికుమార్ ఈ విలేకరుల సమావేశంలో చదవి వినిపించారు. వేలాది ఎకరాలు విలువైన భూములు వైసీపీ నేతల కబ్జాలో ఉన్నాయని చెప్పారు. హనుమంతువాకలో అయిదువేల ఎకరాలను విజయసాయి రెడ్డి బంధువులు కబ్జా చేశారని కూన రవికుమార్ ఆరోపించారు. వాటిపై విచారణ జరిపించే ధైర్యం ఉందా అని ప్రభుత్వానికి సవాల్ విసిరారు.
ఇళ్ల స్థలాల పేరుతో దోపిడీ..
పేదలకు ఇళ్ల స్థలాలను పంచి ఇవ్వాలనే కారణాన్ని చూపుతూ వైసీపీ నాయకులు విలువైన భూములను అడ్డంగా దోచుకుంటున్నారని, దీనిపై న్యాయ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. జగన్, ఆయన తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలు నివసించడానికి ఎనిమిది చోట్ల అత్యాధునికమైన, విలాసవంతమైన భవనాలను నిర్మించుకున్నారని, బెంగళూరులో 36 ఎకరాల్లో విల్లాను కట్టుకున్నారని విమర్శించారు. వేలాది ఎకరాలను కబ్జా చేసుకుని కూడా పేదలకు ఇళ్లస్థలాల కేటాయింపు పేరుతో మరోసారి భూదోపిడీకి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.