టీడీపీలోకి వచ్చేయ్!: జగన్ పార్టీ ఎమ్మెల్యేతో రాయపాటి, అంబటి కౌంటర్
గుంటూరు: తెలుగుదేశం ఎంపీ రాయపాటి సాంబశివరావు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. గుంటూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రి ప్రారంభోత్సవానికి వీరిద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ముగ్గురి మధ్య జరిగిన సంభాషణ అక్కడివారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
కార్యక్రమానికి హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ తూర్పు ఎమ్మెల్యే ముస్తాఫాతో రాయపాటి సాంబశివరావు మాట్లాడుతూ.. 'తెలుగుదేశం పార్టీకి వచ్చేయ్' అని అన్నారు. అంతేగాక, టిడిపిలోకి వస్తే అంతా తానే చూసుకుంటానని హామీ కూడా ఇచ్చేశారు.
వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని భరోసా ఇచ్చారు రాయపాటి. అయితే, ఏం చెప్పాలో తెలియక ముస్తాఫా.. మౌనంగా ఉండిపోయారు. కాగా, అక్కడే అంబటి రాంబాబు జోక్యం చేసుకున్నారు.
'ఇప్పుడే ఎందుకు గానీ.. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉంటే అప్పుడే వస్తుడులే' అంటూ అంబటి కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికల నాటికి ఏఏ నేతలు టిడిపిలో ఉంటారో చూద్దామని అన్నారు. దీంతో ఏం చెప్పకుండానే రాయపాటి అక్కడ్నుంచి వెళ్లిపోయారు.
ఇది ఇలా ఉండగా, తెలుగుదేశం ఎమ్మెల్సీ సతీష్ ప్రభాకర్ కూడా రాయపాటి లాగే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకు వల వేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతిని టిడిపిలో చేరాలని కోరారు. కాగా, గుంటూరులోని ముగ్గురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునేందుకు ఆ పార్టీ నేతలు వైసీపీ వర్గాలు తెలిపాయి.