ఏపీలో తెలుగు మీడియంకు స్వస్తి నష్టమే: ఇంగ్లీష్ మీడియం అమలు కష్టమే.. ఎందుకంటే!!
ఏపీలో ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలలో ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన సాగించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాగున్నా, పూర్తిగా తెలుగు మీడియం తీసివెయ్యాలన్న ఆలోచనతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వ బడులు అన్నింటిలోనూ తెలుగు మాధ్యమం ఎత్తివేస్తూ వచ్చే విద్యా సంవత్సరం నుండి ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే విద్యార్థులకు, తల్లిదండ్రులకు తమకు నచ్చిన మీడియంలో చదువుకునే, తమకు ఏది కావాలో ఎంచుకునే అవకాశం లేకుండా చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి.
తెలుగు మీడియం తీసివేత నిర్ణయంపై భాషాభిమానుల ఆగ్రహం
తెలుగు మాతృభాషగా ఉన్న రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో బోధన లేకుండా చేస్తున్నారని చాలామంది ఆవేదన చెందుతున్నారు. ఇక అంతే కాకుండా ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న చాలామంది ఉపాధ్యాయులు తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చినవారు. ఇక వారు ఇంగ్లీష్ మీడియంలో బోధన చెయ్యాలంటే అది కత్తి మీద సామే అన్న అభిప్రాయం కూడా ఉంది. మాతృ భాషలో విద్యాబోధన అవసరం లేదని ప్రభుత్వం భావించటం భాషాభిమానులకు ఏ మాత్రం రుచించటం లేదు. అమ్మ భాషకు ప్రాధాన్యత ఇవ్వాలని గ్రూప్స్ పరీక్షల్లోనూ తెలుగులో ఉత్తీర్ణత సాధించటం తప్పని సరి చేస్తే, అసలు తెలుగు మీడియం వద్దని తెలుగు మాతృ భాషగా కలిగిన రాష్ట్రంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఏమిటి అన్న ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి.
ఎలాంటి కసరత్తు లేకుండా తెలుగు మీడియం తీసివేత నిర్ణయం
ఏదైనా ఒక శాఖకు సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకునే ముందు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కసరత్తు చేసిన తర్వాతే, సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కానీ చిన్నారుల భవిష్యత్తు సంబంధించి ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం ఏపీ లో చర్చనీయాంశంగా మారింది. ఇకనుండి తెలుగు మాధ్యమాన్ని తీసేసి, ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన చేయాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం విద్యాశాఖకు సంబంధించి ఎలాంటి కసరత్తు చేయకుండానే నిర్ణయం తీసుకుంది. అయితే ఇది అమలుకు సాధ్యమవుతుందా అన్నది కూడా పెద్ద ప్రశ్నే.
తెలుగు మీడియం బ్యాక్ గ్రౌండ్ ఉన్న టీచర్లు 75%.. ఆంగ్ల మాధ్యమం బోధన సాధ్యమా ?
1 నుంచి 8 తరగతుల వారికి తెలుగు మీడియంను తీసివేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా ఇంగ్లీష్ మీడియం గా మార్చాలని నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం లోపు అన్ని రకాలుగా సన్నద్ధమవుతుందా అన్నది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ప్రస్తుతం పాఠశాలలో పనిచేస్తున్న 75% మంది ఉపాధ్యాయులు తెలుగు మాధ్యమంలో చదువుకున్న వారు. వీరంతా చాలా కాలంగా తెలుగు మీడియంలోనే బోధన చేస్తున్నారు. ఇక వీరికి ఒక 30 , 40 రోజులు ట్రైనింగ్ ఇచ్చినంత మాత్రాన ఇంగ్లీష్ మాధ్యమంలో విద్యాబోధన చేయగలుగుతారని నమ్మకం లేదు.
ఇంగ్లీష్ సామర్ధ్యం లేకుండా బోధన ? ... తెలుగు మీడియం తీసివేతపై ఆగ్రహం
ఇక అలాంటి పరిస్థితిలో ప్రభుత్వం ఒక్కసారిగా తెలుగు మీడియం తీసివేసి, ఇంగ్లీష్ మీడియంలో పెట్టినప్పటికీ బోధించే సామర్థ్యం ఉపాధ్యాయులకు లేనప్పుడు ఆ విద్యాబోధన పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారించాల్సిన ప్రభుత్వం, అదేమీ అవసరం లేదు అన్న చందంగా నిర్ణయం తీసుకోవడం అటు ఉపాధ్యాయులకు, ఇది చాలా మంది తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగిస్తుంది. ఇక మరోపక్క వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చెయ్యాలని నిర్ణయించిన ప్రభుత్వ ఉత్తర్వులు అయినా జీవోఎంను రద్దు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది.
తెలుగుమీడియం తీసివేస్తే తెలుగు భాషా మనుగడ మరింత ప్రశ్నార్ధకం అనే ఆందోళన
మాతృభాషలో విద్యాబోధన లేకుండా, ఆంగ్ల మాధ్యమంలోనే విద్యాబోధన చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని పలు సంఘాలు, పార్టీలు ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాయి. ఇక అంతే కాకుండా ఒక స్థాయి వరకు మాతృభాషలో విద్య బోధన అన్ని దేశాలలో ఉంది . ఇందుకు భిన్నంగా మాధ్యమాన్ని మార్చడం అశాస్త్రీయమని కూడా పేర్కొంటున్నారు. మాతృభాష కనుమరుగవుతుందని ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్న తరుణంలో మాతృభాషలో విద్యాబోధన లేకుండా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తప్పని పలువురు విద్యావేత్తలు భావిస్తున్నారు. తెలుగుమీడియం తీసివేస్తే తెలుగు భాషా మనుగడ మరింత ప్రశ్నార్ధకం అనే ఆందోళన ప్రధానంగా కనిపిస్తుంది.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నష్టం చేస్తుందనే భావన
ఒకవైపు ప్రభుత్వ కార్యకలాపాలు ఉత్తరప్రత్యుత్తరాలు తెలుగులో ఉండాలన్న డిమాండ్ బలంగా ఉన్న సమయంలో తెలుగు మీడియం విద్యాబోధనకు స్వస్తి, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు తీరని నష్టం చేస్తున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ జగన్ కు ఇదే విషయంలో లేఖ సైతం రాశారు. ఏది ఏమైనా విద్యార్ధుల ఆసక్తి, తల్లిదండ్రుల అభిప్రాయం, ఉపాధ్యాయుల సంసిద్ధత ఇవేవీ తెలుసుకోకుండా ఏపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఏపీ విద్యావ్యవస్థలో ఎలాంటి పరిణామాలకు కారణం అవుతుంది అనేది వేచి చూడాలి.