డీజీపీకి వద్దకు చేరిన న్యూస్ యాంకర్ పై దాడి వ్యవహారం: వీడియోలను ఎడిట్ చేశారంటూ..!
అమరావతి: ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ టీవీ9లో యాంకర్ గా పని చేస్తోన్న నల్లమోతు దీప్తిపై చోటు చేసుకున్న దాడి వ్యవహారం.. పోలీస్ డైరెక్టర్ జనరల్ వద్దకు చేరింది. తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని కోరుతూ ఆమె డీజీపీ గౌతమ్ సవాంగ్ కు విజ్ఞప్తి చేశారు. ఆ మేరకు ఆయనకు లిఖితపూరకంగా ఫిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం ఆమె తోటి రిపోర్టర్ హసీనాతో కలిసి మంగళగిరిలోని డీజీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. గౌతమ్ సవాంగ్ ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.
రాజధాని అమరావతి పరిధిలోని ఉద్దండరాయుడని పాలెం వద్ద శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్షను చేపట్టిన విషయం తెలిసిందే. ఈ దీక్షను కవర్ చేయడానికి వెళ్లిన దీప్తిపై ఆందోళనకారులు దాడి చేశారు. ఆమె పట్ల దురుసుగా ప్రవర్తించారు. దౌర్జన్యానికి దిగారు. ఉద్దేశపూరకంగా, కక్షపురితంగా తనపై దాడి చేశారని దీప్తి ఆరోపిస్తున్నారు. అలాగే- సోషల్ మీడియాలో తనకు సంబంధించిన కొన్ని పాత విడియోలు జత చేసి, ట్రోల్స్ చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. వారిపైనా చర్యలు తీసుకోవాలని కోరారు.
సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తాను అనని మాటలను అన్నట్టుగా పాత వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై సర్క్యులేట్ చేస్తున్నారని అన్నారు. అమరావతి ప్రాంతంలో ఆందోళనలు చేస్తున్న మహిళల వద్ద నుంచి రిపోర్టింగ్ చేస్తున్న దీప్తి, పెయిడ్ ఆర్టిస్టుల ఆందోళన అని వ్యాఖ్యానించినట్లు ఆమెపై ఆరోపణలు ఉన్నాయి. పెయిడ్ ఆర్టిస్టులంటూ కామెంట్ చేయడం వల్లే దాడి చేశారంటూ సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు వైరల్ గా మారాయి.
ఈ దాడి సందర్భంగా ఆందోళనకారులు మీడియా వాహనాలనూ కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటన ముగిసిన తరువాత కూడా దీప్తికి బెదరింపు ఫోన్ కాల్స్ వెళ్లాయని తెలుస్తోంది. ఆయా అంశాలన్నింటినీ ఆమె డీజీపీ గౌతమ్ సవాంగ్ దృష్టికి తీసుకెళ్లారు. తనపై దాడికి దిగిన వారితో పాటు, నకిలీ వీడియోలను పుట్టించి, సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ చేస్తోన్న వారిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.