కవి, కథా రచయిత ధేనువకొండ శ్రీరామమూర్తి ఇక లేరు
కవి, రచయిత డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి కన్ను మూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు.
హైదరాబాద్: కవి, రచయిత డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి కన్ను మూశారు. గుండెపోటుతో ఆయన గురువారం ఉదయం ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ప్రకాశం జిల్లా చీరాలకు చెందిన శ్రీరామమూర్తి హైదరాబాదులో స్థిరపడ్డారు.
హైదరాబాదులో ఆయన సిద్దేశ్వర రిసెర్చి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదం అనే సంస్థను నడిపారు. తన వృత్తిలో తీరిక లేకుండా ఉంటూనే ఆయన కవిత్వ రచన, కథా రచన చేశారు. ఆయన చింతయామి, ఆశల సముద్రం, వల్మీకం, మోహ తిమిరం అనే కవితా సంపుటాలను వెలువరిచారు. అమ్మ ఒడి అనే దీర్ఘకవిత రాశారు.
ఐలాండ్ విల్లా పేర కథల సంపుటిని వెలువరించారు. ఒంగోలు ప్రాంత జీవిత వాస్తవికతని ఐలాండ్ విల్లా కథలు తెలియజేస్తాయని సాహిత్యకారుడు కెపి అశోక్ కుమార్ అన్నారు. తెలుగు సాహిత్య విమర్శకుడు గుడిపాటికి ఆయన సన్నిహితుడు. డాక్టర్ ధేనువకొండ శ్రీరామమూర్తి రాసిన తొలి నవల స్నిగ్ధచాయ.
ఈ నవలలో మానవ జీవిత అనేక కోణాలను అనేక పార్శ్వాలను చిత్రించిన తీరు బావందని అంపశయ్య నవీన్ రాశారు. ఈ నవలకు 2014 సంవత్సరంలో రచయిత తొలినవలకు ఇచ్చే 10000రూపాయల బహుమతిని అంపశయ్య నవీన్ లిటెరరీ ట్రస్ట్ ఈ రోజు వరంగల్ లో అందజేసింది.
వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యుడైన ధేనువకొండ శ్రీరామమూర్తి 1947లో సంగీత, సాహిత్య సంప్రదాయాలు గల కుటుంబంలో జన్మించారు. తల్లిదండ్రులు ఆదిలక్ష్మమ్మ, రామసుబ్బారావు. ఒంగోలులోని సిఎస్ఆర్ శర్మ కాలేజీలో పియుసి చదివారు. ఆ తర్వాత హైదరాబాద్లోని ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో బిఎఎంఎస్ చదివారు.