దటీజ్ రామానాయుడు!: వెంకయ్య స్పందన, జూ ఎన్టీఆర్తో కలిసి హరి
హైదరాబాద్: రామానాయుడు మృతిపట్ల కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు స్పందించారు. అంకిత భావం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చునని నిరూపించారని వెంకయ్య అన్నారు. చలనచిత్ర పరిశ్రమలో ఎవరు తీయనన్ని సినిమాలు తీశారన్నారు. ఎందరిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని చెప్పారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవాకార్యక్రమాలు చేపట్టారన్నారు. తెలుగు నిర్మాతలకు ఆయన పెద్ద బాలశిక్ష వంటి వారన్నారు.
తమ గ్రామంలో రామానాయుడు ఆడిటోరియం నిర్మించారని గుర్తు చేశారు. దాదాపు అన్ని భారతీయ భాషల్లో చిత్రాలు నిర్మించారన్నారు. ప్రజల మనసులో చిరస్థాయిగా నిలిచారన్నారు. అనేక మంది దర్శకులు, సంగీత దర్శకులు, హీరోలు, హీరోయిన్లను పరిచయం చేశారన్నారు. తనకు రామానాయుడు, ఆయన తనయుడు సురేష్ (నిర్మాత), వెంకటేష్ (హీరో), మనవళ్లతో తనకు మంచి పరిచయం ఉందని చెప్పారు.
రామానాయుడు మృతదేహానికి నివాళులు అర్పించేందుకు... చిరంజీవి, లక్ష్మీ పార్వతి, సీపీఐ నారాయణ, నాగార్జున, అల్లు అర్జున్, మంచు మనోజ్, ఆనం రామనారాయణ రెడ్డి, హీరో తరుణ్, వందేమాతరం శ్రీనివాస్, లక్ష్మీపార్వతి, ఆర్ నారాయణమూర్తి, దిల్ రాజు, జయప్రద, రవిబాబు తదితరులు వచ్చారు. నందమూరి హరికృష్ణ తన తనయులు జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్లతో కలిసి వచ్చారు.
తీరనిలోటు: రోశయ్య
రామానాయుడు మృతి తీరని లోటు అని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ఆోయనతో తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారు. 1953 నుండి తనకు మంచి సాన్నిహిత్యం ఉందని చెప్పారు.
రామానాయుడు అన్ని భాషల్లో సినిమాలు తీశారని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. సినిమా ఫీల్డులో ఎవరికి కష్టాలు వచ్చినా ఆయన ముందుంటారని చెప్పారు. రామానాయుడు మృతి తీరని బాధాకరమన్నారు. ఆయన మృతితో చాలామంది అనాథలయ్యారన్నారు. సినిమా పరిశ్రమ హైదరాబాదుకు రావడంలో ఆయనది కీలకపాత్ర అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరలని కోరుకంటున్నట్లు తెలిపారు.