తెలుగు కథల 'మాంత్రికుడు' వి చంద్రశేఖర రావు ఇక లేరు
ప్రముఖ తెలుగు కథా రచయిత వి.చంద్రశేఖర రావు కన్నుమూశారు.తెలుగు కథా రచనలో ఆయన నూతన ఒరవడిని సృష్ఠించారు. మ్యాజిక్ రియలయం టెక్నిక్ను ఆయన కథా రచనకు విరివిగా వాడుకున్నారు.
హైదరాబాద్: ప్రముఖ తెలుగు కథా రచయిత వి.చంద్రశేఖర రావు కన్నుమూశారు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం హైదాబాదులో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి తెలుగు సాహిత్యకారులు విషాదంలో మునిగిపోయారు. గుండెపోటుతో ఆయన అకాల మృత్యువాత పడ్డారు. ఆయనకు కుమారుడు, కూతురు ఉన్నారు.
తెలుగు కథా రచనలో ఆయన నూతన ఒరవడిని సృష్ఠించారు. మ్యాజిక్ రియలయం టెక్నిక్ను ఆయన కథా రచనకు విరివిగా వాడుకున్నారు. దీంతో ఆయన కథలు తెలుగు కథాసాహిత్యంలో ప్రత్యేకంగా నిలిచాయి. జీవని, లెనిన్ ప్లేస్, మాయాలాంతరు, ద్రోహవృక్షం వంటి కథా సంకలనాలను వెలువరించారు.
ఆయన నల్లమిరియం చెట్టు అనే నవల కూడా రాశారు. ఆయన రాసిన మరో నవల ఆకుపచ్చ దేశం గురించి ప్రముఖ కవి కె. శివారెడ్డి ఇలా వ్యాఖ్యానించారు. "ఆకుపచ్చని దేశం నవల మొత్తాన్ని ఒక సుదీర్ఘమైన పాటలా కన్సీవ్ చేశాడు. జానపదుల సమూహం నుంచి ఒక వృద్ధుడు లేచి గొంతెత్తి అలా తమ జాతి చరిత్రను గానం చేసుకుంటూ పోయినట్లు - ఒక పోరాట నిర్మాణం ఎలా చేయాలో, ఒక కలను వాస్తవం ఎలా చేసుకోవాలో ధ్వనించే గొప్ప గానమీ నవల. పాత్రలు మానవజాతి మహేతిహాస స్మృతుల్నుంచి జన్మించిన యోధుల్లానూ, పురా వ్యక్తుల్లానూ ఇది ఒక లాంగ్ మార్చ్. నవలను చదివి పుస్తకం మూసినాక ఒక్కసారిగా ఒళ్ళు జలదరించింది. అనేక భావాలు ముప్పిరిగొని కొన్ని వేల సంవత్సరాలుగా నాలో నాతో జీవిస్తూ అకస్మాత్తుగా ఒక యోధుడెవరో బయటికొచ్చినట్లు"
వి. చంద్రశేఖర రావు గుంటూరు వైద్య కళాశాలలో చదివారు. ఆ తర్వాత రైల్వేలో ఉద్యోగం చేశారు. గత మేలో ఆయన పదవీ విరమణ చేశారు. ప్రముఖ కవి కె శివారెడ్డి, వాసిరెడ్డి నవీన్ వంటివారు ఆయనకు అత్యంత సన్నిహితులు. వి.చంద్రశేఖర రావు రాసిన మోహనా... మోహనా... కథపై వివాదం కూడా నడిచింది. మార్క్సిస్టు సిద్దాంత నేపథ్యంలో ఆయన కథలు రాశారు. ఐదు హంసలు అనే నవల కూడా ఆయన రాశారు
చంద్రశేఖర రావు అంత్యక్రియలు ఆదివారం గుంటూరులో జరుగుతాయి. ఆయన మృతికి ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత కె. శివారెడ్డి తీవ్ర సంతాపం ప్రకటించారు. తెలుగు సాహిత్యానికి ఆయన మరణం తీరని లోటు అని అన్నారు.