నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు..! కారణం అదే అంటున్న శాస్త్రవేత్తలు..!!
Recommended Video
హైదరాబాద్ : వామ్మో ఏం ఉక్క పోతరా నాయనా.. పుట్టి బుద్ధి ఎరిగినప్పటి నుంచి ఈ స్థాయి ఎండలను చూడలేదు.. అమ్మో ఇవేం ఎండలు.. బాబోయ్ తట్టుకోలేకపోతున్నాం... ఎండలపై జనాల మాట ఇది. ఉష్ణోగ్రత 42డిగ్రీలు దాటితేనే ఉక్కిరిబిక్కిరవుతాం! ఇప్పుడు 45డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ఎండ తీవ్రత ఇంతగా పెరిగిపోవడానికి కారణమేంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వాతావరణ శాస్త్రవేత్తలు మాత్రం ఇందుకు నాలుగు కారణాలను విశ్లేషిస్తున్నారు.
ఫణి రాకతో సెగలు..!గాలిలో తేమను తీసుకెళ్లిన ఫణి తుపాను..!!
ఈ వేసవి సీజన్లోనే ఏప్రిల్లో ఆగ్నేయ బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఫణి తుపాను ఏర్పడింది. దీని ప్రభావంతో గాలిలో తేమ శాతం తగ్గిపోయింది. సాధారణంగా ఎండాకాలంలో గాలిలో తేమ 35 నుంచి 40 శాతం దాకా ఉంటుంది. ‘ఫణి' ప్రభావంతో గాలిలో తేమ 15 శాతం నుంచి 20 శాతం తగ్గిపోయింది. తేమ తగ్గిపోవటంతో ఎండ తీవ్రత పెరిగిపోయింది. కాగా, తెలంగాణ కోర్ హీట్వేవ్' జోన్లో ఉంది. రాజస్థాన్ నుంచి మొదలయ్యే జోన్లో తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘగఢ్, ఒడిసా, ఏపీ రాష్ట్రాలు ఈ జోన్ పరిఽధిలో ఉన్నాయి. ఉత్తర భారతం నుంచి వచ్చే గాలులు ఇక్కడ ప్రతాపాన్ని చూపిస్తున్నాయి.
తీక్షణ కిరణాలు..! ఉత్తర, వాయువ్య దిశల నుంచి వేడి గాలులు..!!
భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్య లో తిరుగుతుంది. సరిగ్గా సూర్యుడు భూమధ్య రేఖకు దగ్గరగా వచ్చినపుడు ఎండాకాలం వస్తుంది. ఈ సమయంలో సూర్య కిరణాలు భూమిపై నిటారుగా పడుతాయి. దీంతో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరో వారం, 10 రోజుల్లో దిశలు మారితే సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతాయి. అప్పుడు ఎండ తీవ్రత తగ్గిపోతుంది.
ద్రోణి దెబ్బ..! భూమిపై నిటారుగా పడుతున్న సూర్యకిరణాలు...!!
ప్రస్తుతం ఒక ఉపరితల ఆవర్తన ద్రోణి శ్రీలంక దగ్గర ‘కోమోరిన్' ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఛత్తీసగఢ్, మధ్య మహారాష్ట్ర, ఇంటీరియర్ కర్ణాటక, ఇంటీరియర్ తమిళనాడు, ఛత్తీస్ ఘఢ్ మీదుగా కోమోరిన్ వరకు 0.9 కి.మీ ఎత్తు వరకు ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో వడగాడ్పులు ఎక్కువగా వీస్తున్నాయి.
బయటకు వస్తే భగభగలే..! తస్మాత్ జాగ్రత్త..!!
మరో మూడు రోజుల పాటు రోహిణి మంటలు కొనసాగుతాయని, ఆపై మరో వారం వరకూ సాధారణం కన్నా ఒకటి నుంచి రెండు డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, రుతుపవనాలు ప్రవేశించిన తరువాతే సాధారణ స్థాయి నెలకొంటుందని అంచనా వేశారు. మంచిర్యాల జిల్లాలో అత్యధికంగా 47డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దాదాపు 120చోట్ల ఉష్ణోగ్రతలు భారీగా పెరిగినట్టు వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వడగాలులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎండ తీవ్రంగా ఉన్న సమయంలో భయటకు వెళ్లకపోవడం మంచిదని సూచిస్తున్నారు. ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తే మంచినీరు తమ వెంట తీసుకుపోవాలని, ప్రతి అరగంటకు నీరు సేవించాలని సూచించారు.