మళ్లీ కలవనున్న ఇద్దరు చంద్రులు: విభజన సమస్యలపై గవర్నర్ సమక్షంలో!..
మంత్రులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఇప్పుడు కేసీఆర్-చంద్రబాబు మధ్య మరోసారి భేటీ జరగబోతోంది.
హైదరాబాద్: ఇద్దరు చంద్రుల కలయిక ఎప్పుడూ జరిగినా రెండు తెలుగు రాష్ట్రాల జనం విషయమేంటా? అని ఆసక్తిగా ఆరా తీస్తారు. అలాంటి కలయిక మరోసారి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో పలు ఉమ్మడి సమస్యలు ఇంకా అపరిష్కృతంగానే ఉన్నందునా.. మరోసారి వీరిద్దరు భేటీ అవనున్నట్లు తెలుస్తోంది.
రెండు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ సారథ్యంలో సోమవారం నాడు తెలంగాణ సీఎం చంద్రశేఖర్ రావు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కలిసే అవకాశం ఉంది. పెండింగ్లో ఉన్న విభజన సమస్యల పరిష్కారంపై గవర్నర్ సమక్షంలో వీరిద్దరు చర్చించనున్నారు.
ఏపీలోని వెలగపూడిలో తాత్కాళిక సచివాలయం నిర్మాణం జరిగిపోవడంతో.. హైదరాబాద్ లోని సచివాలయ భవాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించే అంశం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. కాగా, విభజన సమస్యలపై గతంలో ఇరు రాష్ట్రాల మంత్రులు గవర్నర్ సమక్షంలో చర్చించారు. అనంతరం ఆ నివేదికలను ఆయా రాష్ట్రాల సీఎంలకు సమర్పించారు.
మంత్రులు ఇచ్చిన నివేదికల ఆధారంగా ఇప్పుడు కేసీఆర్-చంద్రబాబు మధ్య మరోసారి భేటీ జరగబోతోంది. మరి సోమవారం నాటి భేటీతోనైనా విభజన సమస్యల్లో కొన్నయినా ఒక కొలిక్కి వస్తాయో? లేదో? చూడాలి.