న్యూ ఇయర్ మత్తులో తెలుగు రాష్ట్రాలు: భారీగా డ్రగ్స్ దందాకు తెరలేపిన డ్రగ్స్ మాఫియా
తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ మాఫియా రెచ్చిపోతోంది. న్యూ ఇయర్ టార్గెట్ గా భారీగా డ్రగ్స్ దందాకు తెరలేపింది . చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని డ్రగ్స్ మాఫియా ఇప్పటికే విస్తరిస్తున్నట్టు తాజా పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో, ఇక తెలుగురాష్ట్రాల్లోని హైదరాబాద్, వైజాగ్ , విజయవాడల కేంద్రాలుగా డ్రగ్స్ రాకెట్స్ విచ్చలవిడిగా తమ దందా సాగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలలో పలుమార్లు డ్రగ్స్ మాఫియాను అరికట్టటం కోసం పోలీసులు , నార్కోటిక్స్ అధికారులు చాలా ప్రయత్నం చేస్తున్నా డ్రగ్స్ మాఫియా రోజుకో కొత్త పద్దతిలో తమ దందా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు న్యూ ఇయర్ వేడుకలకు సర్వం సిద్ధం చేసుకున్నారు.
యువతలను బానిసలుగా చేస్తూ రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా ..
గతంలో సినీ ప్రముఖులకు డ్రగ్స్ రాకెట్ తో సంబంధాలున్నాయన్న కారణంగా డ్రగ్స్ మాఫియా ఏం చేస్తుందో వెలుగులోకి వచ్చింది.అప్పటి నుండి ఇప్పటివరకూ పలు సందర్భాల్లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న డ్రగ్స్ ముఠాలను పట్టుకున్నప్పటికీ పూర్తిస్థాయిలో ఈ ముఠాల ఆగడాలకు చెక్ పెట్టలేక పోయారు ఎక్సైజ్, పోలీస్ మరియు నార్కోటిక్స్ అధికారులు.ఇటీవల స్కూళ్ళు, కాలేజీలు టార్గెట్ చేస్తూ డ్రగ్స్ మాఫియా యువతను పెడదారి పట్టి స్తోందని, డ్రగ్స్ కు యువతను బానిసలుగా చేస్తుందని పలు సంఘటనల ద్వారా తేటతెల్లమైంది.
సన్ బర్న్ ఫెస్ట్ టార్గెట్ గా న్యూ ఇయర్ వేడుకలకు భారీగా దిగుమతి అయిన డ్రగ్స్
రకరకాల మార్గాలతో రెచ్చిపోతున్న డ్రగ్స్ మాఫియా ఇప్పుడుతమ దందా సాగించటానికి కొత్త మార్గం ఎంచుకుంది. ముఖ్యంగా న్యూ ఇయర్ వేడుకను టార్గెట్ చేసుకుని తాజాగా డ్రగ్స్ దందా ఇటు హైదరాబాద్, అటు వైజాగ్, విజయవాడలు అడ్డాలుగా తమ వ్యాపారాన్ని నిర్వహిస్తుంది. యువతను మత్తులో జోగేలా చేస్తుంది.2014 నుండి హైదరాబాద్ లో జరుగుతున్న సన్ బర్న్ ఫెస్ట్ లో కూడా డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగిస్తున్నరనే ఆరోపణ ఉంది. ఇక ఈ ఏడాది కూడా సన్ బర్న్ ఫెస్ట్ సందర్భంగా భారీగా డ్రగ్స్ దిగుమతి అయ్యాయన్న వార్తలు హైదరాబాద్ లో హల్చల్ చేస్తున్నాయి.
వైజాగ్ , విజయవాడలోనూ డ్రగ్స్ కల్చర్
ఇక వైజాగ్ లో సైతం పబ్ కల్చర్, రేవ్ పార్టీల కల్చర్ పెరగటంతో అక్కడ కూడా చాలా సార్లు డ్రగ్స్ పట్టుబడిన ఘటనలు వెలుగుచూశాయి. ఇక విజయవాడ కేంద్రంగా కూడా పలు కళాశాలల్లో డ్రగ్స్ దందా యధేచ్చగా సాగింది. ఇంకా డ్రగ్స్ పెడలర్స్ తమ కార్యాకలాపాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ ఏజెన్సీ ప్రాంతాల నుండి వస్తున్న గంజాయి, ఇతర దేశాల నుండి దిగుమతి చేస్తున్న ఎండీఎం, కొకైన్, బ్రౌన్ షుగర్, హెరాయిన్ వంటి మాదక ద్రవ్యాలను ఎక్కువగా వినియోగిస్తూ యువత మత్తులో జోగుతున్నారు.
రసాయన పరిశ్రమలే అడ్డాలు... కాఫీ షాప్ లే టార్గెట్ జోన్లు
ఇప్పుడు డ్రగ్స్ మాఫియా పోలీసులకు అనుమానం రాకుండా మూతపడిన రసాయన పరిశ్రమలను అడ్డాలుగా చేసుకుని తమ డంప్లను ఏర్పరుస్తూ స్కూళ్ళు, కళాశాలలలో డ్రగ్స్ రవాణాపై పోలీసులు దృష్టి సారించిన నేపద్యంలో ఇప్పుడు డ్రగ్ పెడలర్స్ దృష్టి చిన్న చిన్న కాఫీ షాపుల మీద పెట్టారు.ఒకప్పుడు విదేశీయులే వ్యాపారం చేస్తే ఇప్పుడు తెలుగు వాళ్లీ ఈ దందాలోకి దిగారు . .కాఫీ షాప్ ల ద్వారా డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు గా తెలుస్తోంది. ఎక్కువగా యువత వచ్చే కాఫీ షాప్ లను టార్గెట్ చేసుకున్న పెడలర్స్ కాఫీ షాప్ ల ద్వారా అమ్మకాలు సాగిస్తే ఎవరికీ ఎలాంటి అనుమానాలు రావని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.అందుకే కాఫీ షాపుల కేంద్రంగా ఈ దందా సాగిస్తున్నట్టు తెలుస్తుంది.
న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ .. అధికారులు ఏం చేస్తారో ?
ఇక రేపటి న్యూఇయర్ వేడుకలకు ఇప్పటికే ఎక్కడికక్కడ డ్రగ్స్ సరఫరా జరిగింది. దీంతో ఈసారి న్యూ ఇయర్ వేడుకలలో మాదకద్రవ్యాల వినియోగం పై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఎక్సైజ్ అధికారులు, నార్కోటిక్స్ అధికారులు, పోలీసులు డ్రగ్స్ సరఫరాపై ఎప్పటికీ నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.హెరాయిన్, కొకైన్, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తూ చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్ మాఫియాను అరికట్టాల్సిన అవసరముంది. మరి న్యూ ఇయర్ వేడుకల్లో అధికారులు ఏం చేస్తారో చూడాలి .