తెలుగు రాష్ట్రాలు కలిసి నడవాలి: కోడెల, జగన్కు పరోక్ష చురక
గుంటూరు: రెండు తెలుగు రాష్ట్రాలు కలిసి పని చేయాలని ఏపీ శాసన సభా పక్ష నేత కోడెల శివప్రసాద్ ఆదివారం అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసమే రాష్ట్ర విభజన జరిగిందని విమర్శించారు. గుంటూరులో ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్లో కోడెల మాట్లాడారు.
భూసమీకరణకు సహకరించిన రైతులను కోడెల అభినందించారు. ఏపీ నవ్యాంధ్రే కాదని, స్వర్ణాంధ్ర కావాలన్నారు. నదీ జలాలను అతి జాగ్రత్తగా వినియోగించుకోవాలన్నారు. విద్యుత్, నీరు పుష్కలంగా ఉంటే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. అభివృద్ధిలో ఏపీ నెంబర్ వన్ కావాలన్నారు.
ఏపీ నెంబర్ వన్ కావాలంటే అన్ని పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. విడిపోయినప్పటికీ తెలుగు ప్రజలు కలిసి ఉండాలన్నారు. తెలుగు రాష్ట్రాలు కలిసి ముందుకు వెళ్లాలన్నారు. కొందరి మాటలు అభివృద్ధికి ఆటంకం కలిగించేలా ఉన్నాయని ప్రతిపక్ష నేత జగన్ను ఉద్దేశించి అన్నారు.
ప్రాజెక్టులను అడ్డుకోవడం సరికాదన్నారు. వ్యవసాయాన్ని కాపాడుకోవలసిన అవసరముందన్నారు. ప్రతి ఇంటా మరుగుదొడ్డి ఉండాలన్నారు. రాజధాని ప్రాంత రైతుల కృషి వృథాగా పోకూడదన్నారు. తెలుగుజాతి గర్వించేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి, సంక్షేమం దిశగా పరిపాలన సాగిస్తున్నారంటూ ప్రశంసించారు.
గ్రామాల్లో కనీస వసతులు కల్పించాలన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా నేతలు మాట్లాడవద్దన్నారు. స్పీకర్ స్థానంలో ఎందరో మహనీయులు పని చేశారని, చట్ట సభల పవిత్రతను కాపాడాలని కోరారు. సభాపతిగా నిష్పక్షపాతంగా పని చేస్తానన్నారు. మంత్రి శిద్ధా రాఘవ రావు వేరుగా మాట్లాడుతూ.. జగన్ ప్రతిపక్ష నేతగా విఫలమయ్యారన్నారు. వైసీపీ నేతలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.