ఏపీ, తెలంగాణ ఆర్టీసీల మంకుపట్టు- మధ్యలో ప్రైవేటుకు లబ్ది- ప్రయాణికుల నిలువు దోపిడీ
రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ మధ్య ఆర్టీసీలు ఎన్ని బస్సులు నడపాలనే అంశం వారికి గుర్తు రాలేదు. అప్పటికే ఎన్ని బస్సులు ఎక్కడెక్కడి నుంచి తిరుగుతున్నాయో అవే కొనసాగించాలని నిర్ణయానికొచ్చేశారు. కానీ కరోనా వచ్చాక ఏపీ ఎక్కువ కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు నడపడం వల్ల తాము నష్టపోతున్నామనే విషయం తెలంగాణ ఆర్టీసీకి తెలిసింది. దీంతో మీరు కిలోమీటర్లు తగ్గించుకుంటేనే బస్సులు నడిపేందుకు అనుమతిస్తామని మంకు పట్టు పట్టింది. సరే లక్ష కిలోమీటర్లకు పైగా తగ్గించుకుంటామని ఏపీఎస్ఆర్టీసీ తేల్చిచెప్పింది. అంతటితో ఆగకుండా టీఎస్ ఆర్టీసీ మరికొన్ని గొంతెమ్మ కోర్కెలను తెరపైకి తెచ్చింది. వీటిపై ఇప్పటికీ ప్రతిష్టంభన వీడలేదు. ఎటొచ్చీ ఇరు ప్రభుత్వాలు తమ ఆర్టీసీలు తిప్పకపోయినా ప్రైవేటు సర్వీసులను మాత్రం యథావిథిగా నడుపుతున్నాయి.
హైదరాబాద్ శివారులో ఆర్టీసీ సర్వీసులు ప్రారంభం... సిటీ సర్వీసులపై త్వరలోనే కీలక నిర్ణయం...
పంతాలకు పోతున్న ఆర్టీసీలు...
తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత మాట ఎలా ఉన్నా ఇరు రాష్ట్రాల ఆర్టీసీల మధ్య మాత్రం అగ్గిపుల్ల వేయకుండానే భగ్గుమంటోంది. ముఖ్యంగా దేశంలో అన్లాక్ ప్రక్రియ మొదలయ్యాక ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులను యథావిథిగా తిప్పాల్సి ఉండగా.. నెలలు గడుస్తున్నా ఇప్పటికీ దాని ఊసే లేదు. పలుమార్లు చర్చలు జరిగినా అవి ఫలితాన్ని ఇవ్వలేదు. ఏపీతో పోలిస్తే తమ బస్సులు తక్కువ కిలోమీటర్లు తిరుగుతున్నందున మీరు కిలోమీటర్లు తగ్గించుకోవాలని టీఎస్ ఆర్టీసీ కోరింది. దానికి ఏపీఎస్ఆర్టీసీ ఒప్పుకుంది. అయినా ఇంకా చిన్నా చితకా అంశాలను పట్టుకుని ఆర్టీసీలు బస్సులు నడపడం లేదు. ఏకంగా ప్రభుత్వాధినేతలు జోక్యం చేసుకున్నా ఈ సమస్యకు ముగింపు పలకలేకపోయారు. అంటే ఇరు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడిపే విషయంలో వీరి చిత్తశుద్ధి ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
జగన్ చెప్పినా వినలేదు...
ఏపీ, తెలంగాణ మధ్య, ముఖ్యంగా హైదరాబాద్కు ఆర్టీసీ బస్సుల రాకపోకలు సాగించే విషయంలో ఎంత వరకైనా వెళ్లాలని సీఎం జగన్ తన మంత్రులకు సూచించారు. న్యాయపోరాటం చేసి అయినా సరే హైదరాబాద్కు బస్సుల రాకపోకలు జరిగేలా చూడాలని కేబినెట్లోనే చెప్పారు. జగన్ సూచనతో ఏపీ రవాణామంత్రి పేర్నినాని తెలంగాణ రవాణా మంత్రి అజయ్ కుమార్తో చర్చలకు సిద్ధమయ్యారు. కానీ అజయ్ మాత్రం చివరి నిమిషంలో అధికారుల స్ధాయిలో సమస్యలు తొలగిపోతేనే మంత్రుల స్ధాయి చర్చలు జరుపుతామని చెప్పి వాయిదా వేసేశారు. దీంతో జగన్ సూచన కూడా బుట్టదాఖలైంది. పొద్దున లేస్తే కేసీఆర్తో సత్సంబంధాలు ఉన్నాయని వైసీపీ, జగన్తో మంచి సంబంధాలే ఉన్నాయని టీఆర్ఎస్ నేతలు చెప్తుంటారు. కానీ ముఖ్యమంత్రి స్ధాయిలో జగన్ చెప్పినా వినే వారే కరువయ్యారు.
ఆర్టీసీల తీరుతో ప్రైవేటు లబ్ది
ఎప్పుడూ రద్దీగా ఉండే హైదరాబాద్కు రాకపోకలు సాగించే విషయంలో ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇవ్వని ప్రభుత్వాలు ప్రైవేటుకు మాత్రం విచ్చలవిడిగా అనుమతులు ఇస్తున్నాయి. అలాగని అవి వసూలు చేసే టికెట్ల ధరలపై నియంత్రణ ఉందా అంటే అదీ లేదు. దీంతో ప్రైవేటు బస్సులు అన్ని ప్రాంతాల నుంచి హైదరాబాద్కు రాకపోకలు సాగిస్తూ కోట్ల రూపాయలు వెనకేసుకుంటున్నాయి. మామూలు రోజుల్లోనే వీటి టికెట్ల రేట్లపై అదుపు ఉండదు. ఇప్పుడు పరిస్ధితి మరీ దారుణంగా తయారైంది. దీంతో ఆర్టీసీ బస్సులను కాదని ప్రైవేటుకు అనుమతిస్తున్న ప్రభుత్వాల తీరుపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Recommended Video
ప్రైవేటు బస్సుల దోపిడీ
ప్రభుత్వ సర్వీసులైన ఆర్టీసీ బస్సులను కాదని ప్రైవేటుకు అనుమతులు ఇవ్వడంతో వారు ప్రయాణికులను టార్గెట్ చేశారా అన్నంతగా చెలరేగిపోతున్నారు. ఆర్టీసీ బస్సులు నడుస్తున్నప్పుడే వారి కంటే ఎక్కువ ధరలను ప్రయాణికుల నుంచి వసూలు చేసే ప్రైవేటు బస్సులు ఇప్పుడు మరింతగా రెచ్చిపోతున్నాయి. ప్రస్తుతం నాన్ ఏసీ, ఏసీ బస్సులను నడుపుతున్న ప్రైవేటు యాజమాన్యాలు ఒక్కో టికెట్పై కనిష్టంగా 200 నుంచి గరిష్టంగా 400 రూపాయల వరకూ రేట్లు పెంచి మరీ సొమ్ము చేసుకుంటున్నాయి. అయినా రవాణాశాఖలు వీటిని నియంత్రించడం లేదు. ముఖ్యంగా హైదరాబాద్ కు రాకపోకలు సాగించేందుకు వందల కొద్దీ ప్రైవేటు బస్సులకు కొత్తగా అనుమతులు ఇస్తున్నారు. వారు దరఖాస్తు చేసుకోవడమే పాపం అనుమతులు ఇచ్చేస్తున్నారు. దీంతో కరోనా సమయంలో కోల్పోయిన డబ్బుల్ని అతి తక్కువ సమయంలో కొల్లగొట్టేస్తున్నారు