తెలుగు విద్యార్థికి షాక్: కాలిఫోర్నియా ఎయిర్పోర్టు నుంచి వెనక్కి
తిరుపతి: భారత విద్యార్థులకు అమెరికా అధికారులు ఇంకా చుక్కలు చూపిస్తూనే ఉన్నారు. తాజాగా ఓ తెలుగు విద్యార్థిని అమెరికాలోని కాలిఫోర్నియా విమానాశ్రయం నుంచి వెనక్కి పంపించేశారు. ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన ప్రశాంత్ అనే విద్యార్థిని అమెరికా అధికారులు విమానాశ్రయం నుంచే తిరిగి పంపించేశారు.
అమెరికా వెళ్లిన మరో 22 మంది తెలుగు విద్యార్థులకు అక్కడి అధికారులు వెనక్కి పంపించిన విషయం తెలిసిందే. శనివారం రాత్రి వారు వెనక్కి వచ్చారు. తెలంగాణ డిప్యూటీ సీఎం మహ మూద్ అలీ చొరవతో బయటకు రాగలిగారు. అమెరికాలోని వివిధ యూనివర్సిటీలకు చదువుకోవడానికి దాదాపు 30 మంది తెలుగు విద్యార్థులు రెండు రోజుల క్రితం అమెరికా వెళ్లారు.
న్యూయార్క్ ఎయిర్ పోర్టులోకి వెళ్లాగానే అక్కడి ఇమ్మిగ్రేషన్ అధికారులు వారు చదువుతున్న విశ్వవిద్యాలయాలు బ్లాక్ లిస్టులో ఉన్నాయంటూ వెనక్కి వెళ్లిపోవాలని చెప్పారు. తమ వద్ద అన్ని పత్రాలు ఉన్నాయని చెప్పిన విద్యార్థులపై ఆగ్రహించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు విద్యార్థుల చేతులకు బేడీలు వేసి 24 గంటల పాటు బంధించారు.
ఆ తర్వాత భారత్రు తిరిగి పంపారు. న్యూయార్క్ ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్ అధికారుల చేతుల్లో చిత్రహింసలకు గురైన తెలుగు విద్యార్థులకు తిరిగొచ్చిన తర్వాత శంషాబాద్ ఎయిర్పోర్టులోనూ కష్టాలు తప్పలేదు. శనివారం రాత్రి 8.30 గంటలకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న విద్యార్థులను ఎయిర్ ఇండియా యాజమాన్యం టికెట్ ఖర్చుల కింద లక్ష రూపాయలు చెల్లించాలని పట్టు బట్టింది. తాము అంత మొత్తం చెల్లించ లేమని చెప్పడంతో 8 గంటల పాటు వారిని కదలనీయలేదు.