నదిలో ఈతకు వెళ్లి: అమెరికాలో ప్రకాశం జిల్లా తెలుగు విద్యార్థి మృతి
ఒంగోలు: అమెరికాలో తెలుగు విద్యార్థి నదిలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. ప్రకాశం జిల్లా చీరాల మండలం పేరాలకు చెందిన బాలసురేంద్ర కుమార్ (25) ఎంఎస్ చదివేందుకు టెక్సాస్ వెళ్లాడు.
గత నెల 22వ తేదీన అతను టెక్సాస్ వెల్లాడు. స్నేహితులతో కలిసి నదిలో ఈతకు వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తూ నదిలో మునిగి మృతి చెందాడు. ఈ విషయం తెలిసి బాలసురేంద్ర కుమార్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
బాల సురేంద్ర తండ్రి రమేష్ పేరాలలో కిరాణా షాప్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బాల సురేంద్ర తంజావూరులోని కాలేజీలో బిటెక్ చదివాడు.
క్యాంపస్ సెలక్షన్ ద్వారా టిసిఎస్లో ఉద్యోగం సంపాదించాడు. చెన్నైలో మూడు సంవత్సరాలు పని చేశాడు. బాల సురేంద్ర రెండు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో ఫోన్లో చివరిసారిగా మాట్లాడాడు. బాలసురేంద్ర కుటుంబ సభ్యులకు ఆదివారం ఉదయం ఫోన్ ద్వారా విషయం తెలిసింది.