మీరెందుకొచ్చారు?: తెలుగు విద్యార్థులపై కన్నడిగుల దాడి, ఎందుకంటే..?
కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో రైల్వే, బ్యాంకింగ్ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు.
Recommended Video
హుబ్లీ: కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీలో రైల్వే, బ్యాంకింగ్ పరీక్షలు రాసేందుకు వెళ్లిన తెలుగు విద్యార్థులను అక్కడి కన్నడ సంఘాల నేతలు అడ్డుకున్నారు. విద్యార్థులను పరీక్షా హాల్ వద్ద అడ్డుకొని హాల్ టికెట్లు చించివేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
అంతేగాక, కొందరు తెలుగు విద్యార్థులపై దాడికి పాల్పడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేసి కన్నడ సంఘాల నేతలను అడ్డుకున్నారు. కాగా, బెంగళూరు, హుబ్లీ తదితర రైల్వే స్టేషన్ల వద్ద కన్నడ సంఘాలు ఆందోళన చేపట్టాయి. కన్నడిగుల తీరుతో సుమారు వెయ్యి మంది వరకు తెలుగు విద్యార్థులు హుబ్లీలో ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.
కాగా, కన్నడిగుల ఆందోళనలతో పరీక్షలను రద్దు చేశారు. తమ రాష్ట్రంలో వేరే రాష్ట్రాలకు చెందిన వారు వచ్చి ఐబీపీఎస్ నిర్వహించే పరీక్షలు రాయడానికి వీల్లేదని అపరిచితుల నుంచి తెలుగు అభ్యర్థులకు ఇంతకుముందే ఫోన్లు వచ్చాయి. ఐబీపీఎస్ పరీక్షల్లో తెలుగువారే ఎక్కువగా ఉత్తీర్ణులై తమకు ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారనేది కన్నడిగుల వాదన కావడం గమనార్హం.
సెప్టెంబర్ 9,10, 16,17, 24 తేదీల్లో బ్యాంకు పోస్టుల భర్తీకి కర్ణాటకలో పరీక్షలు రాసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని పలుప్రాంతాలకు చెందిన విద్యార్థులు సిద్ధమయ్యారు. అక్కడి కన్నడ సంఘాలు హెచ్చరికలు జారీ చేస్తూ తమను పరీక్షలు రాయకుండా అడ్డుకుంటున్నాయని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.