ఎపి విద్యార్థులకు పదో షెడ్యూల్ షాక్: తాజాగా తెలుగు వర్శిటీలో తెలంగాణకే...
హైదరాబాద్: పదో షెడ్యూల్లో ఉన్న మరో విద్యాసంస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి షాక్ తగిలే పరిస్థితి ఏర్పడింది. విద్యాసంస్థల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య వివాదం రగులుతూ వస్తున్న విషయం తెలిసిందే. పదో షెడ్యూల్ పరిధిలో గల హైదరాబాదులోని దాదాపు అన్ని యూనివర్సిటీల్లో ఏపీ విద్యార్థులకు ఈ ఏడాది ప్రవేశాలు నిలిచిపోయాయి.
తెలుగు విశ్వవిద్యాలయం అడ్మిషన్ల విషయంలో గవర్నర్ జోక్యం చేసుకున్నప్పటికీ అది ఏపీ విద్యార్థులకు తాత్కాలిక ఊరటనే ఇచ్చింది. తాజాగా తెలుగు విశ్వవిద్యాలయం కూడా కేవలం తెలంగాణ రాష్ట్రం వరకే అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ జారీకి సిద్ధమైంది. రెండు రోజుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలుగు విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ ఎల్లూరి శివారెడ్డి అన్నారు.
తెలంగాణ యూనివర్సిటీ ఏకంగా తన పరిధిలో పనిచేస్తున్న ఏపీలోని ఉద్యోగులకు ఆగస్టు నెల నుంచి జీతాలు కూడా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. ఓపెన్ వర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీలు ప్రధానమైన కోర్సులను అందిస్తున్నాయి. ఒక్క అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలోనే వివిధ కోర్సుల్లో 70వేల మంది ఏపీ విద్యార్థులు అడ్మిషన్లు తీసుకుంటారు.
తాము కేవలం తెలంగాణ వరకే అడ్మిషన్ల ప్రక్రియ చేపడతామని మొదట తెలుగు యూనివర్సిటీ ప్రకటించింది. దీనిపై ఏపీ ప్రభుత్వం గవర్నర్కు ఫిర్యాదు చేసింది. ఎవరికీ అన్యాయం జరగకుండా చూడాలని తెలంగాణ ముఖ్యకార్యదర్శికి గవర్నర్ సూచించారు. దీనిపై తెలంగాణ ముఖ్యకార్యదర్శి, విద్యాశాఖ కార్యదర్శి గవర్నర్ను కలిశారు. ఉన్నత విద్యామండలి విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆయనకు వివరించారు.
ఏ రాష్ట్ర భూభాగంలో ఉన్న సంస్థలు ఆరాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటాయని, ఉమ్మడి నిర్వహణ విషయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు చర్చించుకుని అవగాహనకు రావాలని కోర్టు స్పష్టం చేసింది. నిజానికి పదో షెడ్యూల్లోని సంస్థలు, శాఖల విషయంలో రెండు ప్రభుత్వాలు చర్చించుకుని ఎలా నిర్వహించాలనే దానిపై ఈ ఏడాది జూన్ 1 వరకే ఓ అవగాహనకు రావాల్సి ఉంది.
కానీ ఆ పని జరగలేదు. ఈనేపథ్యంలో తమతో ఏపీ ఎంఓయూ కుదుర్చుకుంటే ఆ రాష్ట్ర విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామని తెలంగాణ స్పష్టం చేసింది. మరోవైపు ఏపీకి చెందిన పారా మెడికల్ అభ్యర్ధుల రిజిసే్ట్రషన్లు చేయడానికి తెలంగాణ పారా మెడికల్ బోర్డు తిరస్కరించింది. తెలంగాణ ప్రభుత్వంతో ఏంఓయూ చేసుకుంటేనే రిజిస్ట్రేషన్లు చేస్తామని తేల్చిచెప్పింది. పదో షెడ్యూల్లో ఉన్న ఏపీ పారా మెడికల్ బోర్డు మూడు నెలలు క్రితం తెలంగాణకు వెళ్లింది. దీంతో అప్పటి నుంచి ఏపీకి చెందిన పారా మెడికల్ అభ్యర్థుల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి.
ఈ నేపథ్యంలో ఏపీ వైద్య విద్యా సంచాలకులు శాంతారావు ఇటీవల తెలంగాణ బోర్డుకు లేఖ రాశారు. ఏపీలో బోర్డు ఏర్పాటు చేసుకునే వరకు ఏపీకి చెందిన వారి రిజిస్ట్రేషన్లు కూడా అనుమతించాలని ఆ లేఖలో కోరారు. అయితే, పదో షెడ్యూల్లోని సంస్థలకు సంబంధించి తెలంగాణతో ఒప్పందం చేసుకుంటేనే అనుమతి ఇస్తామని తిరిగి లేఖ రాశారు.