బాబు బీజేపీకి రాజ్యసభ ఇచ్చినా లాభం లేదు: మోడీకి 'హోదా' రాఖీలు
విశాఖపట్నం: ఏపీకి ప్రత్యేక హోదా హామీని నెరవేర్చని ప్రధాని నరేంద్ర మోడీకి ఏపీ మహిళలు రాఖీలు పంపించి నిరసన తెలపాలని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ మంగళవారం నాడు సూచించారు. మహిళలు, యువతులు అందరూ కూడా ట్విట్టర్, ఫేస్బుక్ ద్వారా మోడీకి రాఖీలు పంపించి, నిరసన తెలపాలన్నారు.
ప్రధాని మోడీకి నిరసన రాఖీలు పంపించేందుకు కొణతాల వాటి డిజైన్లను తన ఫేస్బుక్, ట్విట్టర్ అకౌంట్లలో పెట్టానని చెప్పారు. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చునని తెలిపారు. లేదంటే, ఎవరైనా తమ సొంత డిజైన్లలోను పంపించాలని సూచించారు.
తన సోదరుడు తనకు రక్షణగా ఉంటాడని, ఎల్లప్పుడూ ఆదుకుంటాడని కోరుకుంటూ సోదరి తన సోదరుడికి రాఖీ కడుతుందని, అలాగే ప్రధాని మోడీకి కష్టాల్లో ఉన్న ఏపీకి హోదా ఇవ్వాలని కోరుతూ మహిళలు, యువతులు రాఖీలు పంపించాలన్నారు.
కొణతాల ప్రధానికి పంపేందుకు రూపొందించిన తొమ్మిది రాఖీల నమూనాలను విడుదల చేశారు. రాష్ట్రానికి పెద్దన్నగా మోడీ ప్రజలను ఆదుకోవల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక హాదా, ఉత్తరాంధ్రకు రూ. 15 వేల కోట్ల ఆర్థిక ప్యాకేజీ, పోలవరం నిర్మాణం పూర్తి, విశాఖకు రైల్వే జోన్, రాయలసీమకు ఆర్థిక ప్యాకేజీ వంటి నినాదాలతో రాఖీలు తయారు చేయించామన్నారు.
విభజన చట్టంలోని అంశాలను అమలు చెయ్యాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. టిడిపి రాజ్యసభ స్థానాన్ని రైల్వే మంత్రికి ఇచ్చినా ప్రయోజనం లేక పోయిందన్నారు. రాష్ట్రంలో ఆర్ధిక లోటు ఏడాదికి రూ.13 వేల కోట్లు ఉంటే కేంద్రం రెండేళ్లలో కేవలం రూ.2,800 కోట్లు ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రజల ఆగ్రహం చవిచూడక ముందే కేంద్రం స్పందించి విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అన్నింటిని అమలు చెయ్యాలని కోరారు.