చంద్రబాబు సూపర్, కానీ: లోకేష్ను కలిసి ఎలా పరిరక్షించుకోవాలో చెప్పిన జగదీశ్
తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు, తెలుగు భాష పరిరక్షణ వేదిక కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను తిరుపతిలో కలిశారు.
తిరుపతి: తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు, తెలుగు భాష పరిరక్షణ వేదిక కన్వీనర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను తిరుపతిలో కలిశారు. ఈ సందర్భంగా తెలుగు భాషను పరిరక్షించుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
చంద్రబాబుకు ప్రశంస
ఈ సందర్భంగా రాసిన లేఖలో ఆయన చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. ప్రారంభోత్సవాలలో ఉపయోగించే శిలాఫలకాలను తెలుగులోనే ఉండాలని, అదేవిధంగా వ్యాపార సంస్థలకు సంబంధించిన బోర్డులు తెలుగులోనే ఉండాలన్న చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయానికి అభినందనలు అన్నారు.
పట్టించుకోలేదు
అధికార భాష అమలు చట్టము వచ్చి 48 సంవత్సరాలు అయినా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు తెలుగు భాషను పట్టించుకోలేదని, అంతేకాకుండా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడి దాదాపు మూడేళ్లయినా తెలుగును అటు బోధన భాషగాను, ఇటు పాలన భాషగాను అమలు చేయడంలో విఫలమయ్యాయని కూడా అందులో విమర్శించారు.
సంకల్ప బలం లేకనే
ఈ వైఫల్యానికి కారణం చిత్తశుద్ధి, సంకల్ప బలం లేకపోవడమని, ప్రభుత్వాలకు మాతృభాష అంటే గౌరవం లేకపోవడం అన్నారు. కానీ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలలో ముందుగా మీరు తెలుగు భాష పరిరక్షణకు కంకణం కట్టుకొని ఈ జీవోను తీసుకు రావడం సంతోషమని చంద్రబాబును ప్రశంసించారు.
మా వందనాలు
తెలుగు భాషాభివృద్ధి కమిటీని నియమించి తెలుగు భాష పరిరక్షణకు మీ వంతు కృషికి, మీ చిత్తశుద్ధికి ఓ తెలుగు భాష పరిరక్షణ కొరకు నిరంతరం పోరాటం చేసే మేమంతా మీకు వందనాలు తెలియజేస్తున్నామని చంద్రబాబుకు కితాబిచ్చారు.
మా వంతు కృషి
తమ వంతు బాధ్యతగా రాష్ట్రేతర ప్రాంతాలలో స్థిర నివాసం ఏర్పరుచుకొని తెలుగు భాష వికాసం కొరకు పాటుపడుతున్న మేం మీ ముందు పొరుగు రాష్ట్రాలలోని తెలుగు ప్రజల సమస్యలతో పాటు తెలుగు భాషాభివృద్ధికి మీరు చేపట్టవలసిన కార్యక్రమాలను కొన్నింటిని మీ ముందు ఉంచుతున్నామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ లేఖలో పలు అంశాలు పేర్కొన్నారు.
ఇవీ సూచనలు!
వ్యాపార సంస్థలలో కచ్చితంగా తెలుగులోనే బోర్డులు ఉండాన్న ఏపీ ప్రభుత్వ జీవో అమలు చేయుటకు ఓ టాస్క్ ఫోర్స్ ఉండాలని, ఉత్తర ప్రత్యుత్తరాలు, జీవోలు, కోర్టు ఆదేశాలు.. ఇలా అ్ని తెలుగులో ఉండేలా చూడాలని అందులో పేర్కొన్నారు. జిల్లా సమావేశాల్లో అందరు తెలుగులో మాట్లాడేలా చూడాలన్నారు. ఇంకా పలు సూచనలు చేశారు.