'కేంద్రం మిర్చి ధరను పెంచింది, జగన్ రైతు దీక్ష వల్ల ఏమాత్రం కాదు'
మిర్చి పంటకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించడాన్ని అటు వైసిపి, ఇటు తెలుగుదేశం పార్టీ సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది.
గుంటూరు: మిర్చి పంటకు కేంద్రం గిట్టుబాటు ధర కల్పించడాన్ని అటు వైసిపి, ఇటు తెలుగుదేశం పార్టీ సొమ్ము చేసుకునే ప్రయత్నాలు చేస్తోంది. తమ ప్రభావం వల్లే మిర్చికి గిట్టుబాటు ధర వచ్చిందని ఇరు పార్టీల నేతలు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మిర్చికి మద్దతు ధర లేకపోవడం, రైతుల ఆందోళన నేపథ్యంలో బుధవారం కేంద్రం స్పందించింది. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. రాజకీయంగా సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశ్యం లేని ఆయన మాత్రం మౌనంగా ఉన్నారు.
తాజాగా, డొక్కా మాణిక్య వరప్రసాద్ స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లి మిర్చికి గిట్టుబాటు ధర వచ్చేలా కృషి చేశారని చెప్పారు. జగన్ దీక్ష చేపట్టడం వల్లే మిర్చికి ధర పెంచారని వైసిపి ప్రచారం చేసుకుంటోందని, ఇది తగదన్నారు.
అదే సమయంలో నారా లోకేష్ పైన వైసిపి నేతలు విమర్శలు చేయడంపై కూడా డొక్కా ఆగ్రహం వ్యక్తం చేశారు. లోకేష్పై వైసిపి నేతల విమర్శలను ఖండిస్తున్నామన్నారు. వైసిపి నేత పార్థసారథి స్థాయిని మరిచి మాట్లాడుతున్నారన్నారు.
అంతకుముందు, వైసిపి నేతలు, జగన్ మీడియా కూడా తమ పార్టీ అధినేత రైతు దీక్ష వల్లే కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని చెప్పుకున్నారు. క్వింటాల్ మిర్చికి కేంద్రం రూ.5 వేలు, ఇతర ఖర్చులు మరో రూ.1250 మద్దతు ధర ప్రకటించింది.
మరోవైపు, మిర్చి రైతులకు కేంద్రం అందించిన బాసటపై తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. క్వింటాలు మిర్చికి కేంద్రం రూ.5వేలు అని చెప్పడాన్ని ఆయన తప్పుబట్టారు. అలాగే మార్కెట్లోకి 7 లక్షల టన్నుల మిర్చి వస్తుంటే కేంద్రం కేవలం 33 వేల టన్నులకు పరిమితం చేసిందన్నారు.