అధికారపక్షమేనా?: డిప్యూటీ సీఎం చినరాజప్పకు తమ్ముళ్ల షాక్
గుంటూరు: ఆంధప్రదేశ్ డిప్యూటీ సీఎం, తెలుగుదేశం సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్పకు ఆ పార్టీ కార్యకర్తలు షాకిచ్చారు. పార్టీ జెండా మోసిన తాము ప్రతిపక్షమా, అధికారపక్షమో.. చెప్పమంటూ తెలుగు తమ్ముళ్లు చినరాజప్ప ఎదుట నిరసన గళమెత్తారు. వనం-మనం కార్యక్రమంలో భాగంగా స్థానిక గంటలమ్మ చెరువుకట్టపై చినరాజప్ప మొక్కలు నాటే కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్కు పుష్పాంజలి సమర్పించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాగా, మండలంలోని రెవెన్యూ, పోలీసు అధికారులు తమమాట వినడం లేదంటూ పలువురు కార్యకర్తలు నిరసన వ్యక్తంచేశారు.
పార్టీ విజయానికి కృషిచేసిన తమను కాదని వలసవచ్చిన ఇతర పార్టీల నాయకులకు కొమ్ము కాస్తున్నారంటూ ఆవేదన వెళ్లగక్కారు. దీనిపై చినరాజప్ప స్పందిస్తూ అట్టడుగుస్థాయి నుండి కార్యకర్తలు సమన్వయంతో వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో కీలకపాత్ర పోషించి పార్టీని బలోపేతం చేయాలని కోరారు.
వర్గ రాజకీయాలను విడనాడి సమన్వయంగా ముందుకెళ్తేనే అభివృద్ధి సాధ్యమని హితవు పలికారు. సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యేతో చర్చించి పార్టీ కార్యకర్తలకు ఇబ్బందులు లేకుండా చూస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ కోసం కృషిచేసిన ప్రతి ఒక్కరికీ గుర్తింపు ఉంటుందని, సమర్థ నాయకుడైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో ప్రతి కార్యకర్తా ఉత్తేజభరితంగా పనిచేయాలని కోరారు. శుక్రవారం గుంటూరులో ఉంటానని, సమస్యలు ఉన్న కార్యకర్తలు తన వద్దకు వచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషిచేస్తూ ఇతర పార్టీల నుండి నాయకులు, ఓటర్లను ఆకర్షించడంలో కీలక బాధ్యత వహించాలన్నారు. రాజధాని ఈ ప్రాంతానికి రావడం అదృష్టమని, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు.