అగ్రికల్చర్ జోన్: మాస్టర్ ప్లాన్పై కృష్ణా జిల్లా టీడీపీ నేతల ఆవేదన ఇదీ
విజయవాడ: నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ వల్ల రైతులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందని టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్పై సీఆర్డీఏ అధికారులు శనివారం ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
సీఆర్డీఏ పరిధిలోని 56 మండలాలకు సంబంధించిన ముసాయిదా ప్రణాళిక-2015పై ఈ సమావేశం జరిగింది. ముసాయిదా ప్రణాళికలో గ్రీన్ జోన్ అంశంపై సందేహాలు తీర్చాలని, రైతు సమస్యలను అధికారులు సానుకూలంగా పరిశీలించాలని సదస్సుకు హాజరైన కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు కోరారు.
ఈ ప్లాన్ వల్ల కృష్ణాజిల్లాలోని రైతులకు ఒరిగిందేమీ లేదని మచిలీపట్నం ఎంపీ, టీడీపీ సీనియర్ నేత కొనకళ్ల నారాయణ అన్నట్లు తెలిసింది. ముఖ్యంగా కృష్ణా జిల్లాను అగ్రికల్చర్ జోన్గా ప్రకటించడంతో తమ పని అయిపోయిందని రైతులు ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అన్నారట.
నిన్నటి వరకు ఎకరం భూమి కోటి రూపాయల విలువ చేస్తే, నేడు రూ. 10 లక్షలు కూడా పలకడం లేదని నారాయణ విచారం వ్యక్తం చేశారు. గ్రామాల్లోకి వెళ్తే రైతులు తిడుతున్నారని ఎంతో ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఏ పెళ్లికి వెళ్లినా... చావుకెళ్లినా రైతులు దీనిపైనే మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ వ్యాఖ్యానించారు.
అగ్రికల్చర్ జోన్ పేరుతో కృష్ణాజిల్లాను బలి చేశారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల యొక్క ఆందోళనలు, భయాలను ఈ సమావేశంలో స్పష్టంగా చెప్పడం జరిగిందన్నారు. జోనల్ డెవలప్మెంట్ ప్రణాళికపై ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని నేతలు సీఆర్డీఏ అధికారులకు తెలిపారు.
సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్పై టీడీపీ ఎంపీ కేశినేని నానితోపాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. కృష్ణా జిల్లాలోని తమకు పట్టుకున్న ప్రాంతమంతా అగ్రికల్చర్ జోన్లోకి వెళ్లడమే ఇందుకు కారణం. ఇదిలా ఉంటే ఈరోజు సమావేశానికి టీడీపీ ఎంపీలు కేశినేని నాని, కొనకళ్ల నారాయణ, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వల్లభనేని వంశీ, బోడె ప్రసాద్, ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.