'టీటీడీ'తో తెలంగాణపై పట్టు కోసం బాబు, తమిళనాడుకు బుజ్జగింపు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్, బోర్డు సభ్యుల ఎన్నిక పైన కసరత్తు చేస్తున్నారు. టీటీడీ ఎన్నిక ద్వారా నేతలను, కొన్ని వర్గాలను మచ్చిక చేసుకునే యోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా తెలుస్తోంది. టీటీడీ బోర్డులో తెలంగాణ టీడీపీ నేతలకు అవకాశం ఉంటుందనే వార్తలు ఎప్పుటి నుండో వస్తున్నాయి.
తెలంగాణలో టీడీపీ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ముఖ్యనేతలు అధికార తెరాస పార్టీ వైపు చూస్తున్నారు. ఎన్నికల అనంతరం తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణా రెడ్డి వంటి హార్డ్ కోర్ టీడీపీ నేతలు కారు ఎక్కారు. ఈ నేపథ్యంలో మరికొందరు అధికార పార్టీ వైపు ఆకర్షితులు కాకుండా టీటీడీ బోర్డును ఉపయోగించుకోవాలని చూస్తున్నారని భావిస్తున్నారు.
తెలంగాణ టీడీపీ నేతలకు.. ముఖ్యంగా పక్క చూపు చూస్తారని భావించి ముఖ్య నేతలకు టీటీడీ బోర్డు పదవి ద్వారా మచ్చిక చేసుకోవాలని భావిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. అలాగే, త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా ఇవి ఉపయోగపడేలా నిర్ణయం ఉండవచ్చునని అంటున్నారు. తెలంగాణ నుండి కంటోన్మెంట్ ఎమ్మెల్యే జీ సాయన్న, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యలకు చోటు దక్కవచ్చునంటున్నారు.
జీహెచ్ఎంసీ పరిధిలో తలసాని, తీగల వంటి నేతలు తెరాసలో చేరారు. ఈ నేపథ్యంలో సాయన్న ద్వారా హైదరాబాదు పైన పట్టు సాధించే ఉద్దేశ్యంలో భాగంగా ఆయనకు ఈ పదవి కట్టబెట్టవచ్చునని అంటున్నారు. అలాగే, ఖమ్మం జిల్లాకు చెందిన తుమ్మల నాగేశ్వర రావు కూడా కారు ఎక్కారు. ఈ నేపథ్యంలో సండ్రకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. టీటీడీ చైర్మన్గా చదలవాడ కృష్ణమూర్తి పేరు ఎప్టి నుండో వినిపిస్తోంది.
మరోవైపు, తెలుగుదేశం పార్టీని ఏపీ, తెలంగాణలతో పాటు తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు విస్తరించాలని చంద్రబాబు ఎప్పటి నుండో యోచిస్తున్నారు. అయితే, ఇటీవల శేషాచలం ఎన్కౌంటర్ ఘటన నేపథ్యంలో తమిళనాడు - ఆంధ్రప్రదేశ్ మధ్య చిచ్చు రాజుకుంది. దీనిపై పెద్ద పార్టీలు అంత పెద్దగా స్పందించనప్పటికీ.. చిన్న పార్టీలు పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు వారికి కూడా టీటీడీ బోర్డులో అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.