టీడీపీ జాతీయ పార్టీ, పోటీకి 'సైకిల్'కి చిక్కుల్లేవ్: ఎందుకంటే..
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీగా మారితే.. గుర్తు (సైకిల్), పార్టీ పేరు (తెలుగుదేశం) పరంగా ఇబ్బందులు వస్తాయనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఆ పరంగా ఎలాంటి సమస్యలు ఉండవని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు శుక్రవారం నాడు చెప్పారు.
సైకిల్ గుర్తు టీడీపీకే ఉంటుందని యనమల చెప్పారు. మహానాడులో యనమల రాజకీయ తీర్మానం ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా మాట్లాడారు. సమాఖ్య స్ఫూర్తిని టీడీపీ గౌరవిస్తుందని చెప్పారు. కాంగ్రెస్ వ్యతిరేక పార్టీగా టీడీపీకి జాతీయస్థాయిలో గుర్తింపు ఉందన్నారు.
టీడీపీ రెండు రాష్ట్రాల్లో బలంగా ఉందని చెప్పారు. కనీసం నాలుగు రాష్ట్రాల్లో నమైదై ఉంటే జాతీయ పార్టీగా ఉంటుందని చెప్పారు. కర్నాటక, తమిళనాడు, ఒడిశా రాష్ట్రాలలో విస్తరిస్తామని చెప్పారు. పుదుచ్చేరి, అండమాన్ నికోబర్ దీవుల్లోను విస్తరిస్తామన్నారు. జాతీయ పార్టీగా తెలుగుదేశం అంటూ రాజకీయ తీర్మానం చేశారు.
మోడీ ప్రభుత్వం అన్యాయం చేయదు
ప్రధాని మోడీ ప్రభుత్వం ఏపీకి అన్యాయం చేయదని యనమల చెప్పారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సంబంధాలు బలంగా ఉండాలన్నదే టీడీపీ, బీజేపీ సిద్ధాంతమన్నారు. కేంద్రం నుండి నిధులు తెచ్చుకునేందుకు రాజీపడమని చెప్పారు.
కేంద్రంలో బీజేపీ యాంటీ కాంగ్రెస్, ఇక్కడ టీడీపీ యాంటీ కాంగ్రెస్ అని, అందుకే కాంగ్రెస్ పార్టీని కలిసి ఇంటికి పంపించామన్నారు. రాష్ట్రాలు బలంగా ఉంటేనే కేంద్రం బలంగా ఉంటుందని, కేంద్రం బలంగా ఉంటేనే రాష్ట్రాలు బలంగా ఉంటాయనేది మోడీ సిద్ధాంతామని, తాము దానిని నమ్ముతున్నామన్నారు.
విభజన హామీల అమలుకు కేంద్రంతో సయోధ్యంగా వెళ్తామని చెప్పారు. జాతీయస్థాయిలో నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది టీడీపీయే అన్నారు. పన్నుల సంస్కరణల్లో కీలక పాత్ర పోషించామన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్నామని చెప్పారు.
గురువారం యనమల మాట్లాడుతూ... టీడీపీ జాతీయ పార్టీగా మారినా పేరు కానీ, ఎన్నికల గుర్తు సైకిల్ కానీ మారదని చెప్పారు. తమ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు టీడీపీ పేరు మారిస్తే బాగుంటుందని కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల ప్రతినిధులు కోరారని చెప్పారు. అలాగే కర్నాటకలో సమాజ్ వాది పార్టీ సైకిల్ గుర్తు పైన పోటీ చేస్తున్నందున ఎన్నికల గుర్తు మార్చాల్సి వస్తుందేమోనని అభిప్రాయపడ్డారని చెప్పారు.
టీడీపీకీ గుర్తు ఇబ్బంది ఎందుకు ఉండదు?
టీడీపీ జాతీయ పార్టీగా అయినా గుర్తుతో ఇబ్బంది ఉండదని యనమల చెప్పారు. దీనికి కారణం ఉందని అంటున్నారు. టీడీపీకి సైకిల్ గుర్తు ఉంది. అలాగే యూపీలో అధికారంలో ఉన్న సమాజ్ వాది పార్టీకి కూడా సైకిల్ గుర్తు ఉంది.
టీడీపీ జాతీయ పార్టీ అయితే ప్రధానంగా గుర్తు విషయంలో ఇబ్బందులు రావొచ్చని భావించారు. కానీ ఇబ్బంది లేదని అంటున్నారు. టీడీపీని జాతీయ పార్టీగా ఎన్నికల సంఘం గుర్తించాలంటే కనీసం నాలుగు రాష్ట్రాల్లో నిర్దేషిత శాతం ఓట్లు లేదా సీట్లు సాధించాలి.
ఇబ్బంది ఎందుకు రాదంటే.. టీడీపీ బలంగా ఉన్న రాష్ట్రాల్లో సమాజ్ వాది పార్టీ లేదు. ఎన్నికల సంఘం తాజా నిబంధనల ప్రకారం రెండు పార్టీలకు ఒకే గుర్తు ఉంటే ఏ రాష్ట్రంలో ఎవరు బలంగా ఉంటే వారికి ఆ గుర్తు కేటాయించాలి. అందువల్ల దక్షిణాదిలో సైకిల్ గుర్తు విషయంలో టీడీపీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని చెబుతున్నారు. పార్టీ పేరు విషయంలో మాత్రం ఆలోచన చేస్తున్నారు.