'పవన్ కళ్యాణ్ అలా చెప్పలేదు', 'చంద్రబాబు లేఖతో దేశంలో పెనుమార్పు'
విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనంతపురం బహిరంగ సభ పైన తెలుగుదేశం పార్టీ నేత, ఎమ్మెల్యే బోండా స్పందించారు. పవన్ కళ్యాణ్ను, ఆయన స్థాపించిన జనసేనను తాము ఇప్పటికీ మిత్రపక్షంగానే భావిస్తున్నామని చెప్పారు.
2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తానని పవన్ చెప్పలేదన్నారు. తద్వారా వచ్చే ఎన్నికల్లోను జనసేన అధినేత తమ వెంటే ఉంటారని తెలుగుదేశం పార్టీ భావిస్తున్నట్లుగా ఉంది. పవన్ టిడిపి వెంట ఉంటేనే కాపు ఓట్లు, యువత ఓట్లు ఎక్కువగా టిడిపి వైపు ఉంటాయని, లేదంటే ఓట్లు చీలిపోతాయని భావిస్తున్నారు.
జగన్ పైన మంత్రి పల్లె నిప్పులు
దోచుకుని, దాచుకున్న డబ్బును ఎలా బయటికి తీయాలో తెలియని నిస్సహాయస్థితిలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి మాట్లాడుతుంటే సిగ్గేస్తోందని మంత్రి పల్లె రఘునాథ రెడ్డి ఎద్దేవా చేశారు.
అనంతపురం జిల్లా కొత్తచెరువు, పుట్టపర్తి మండలాల్లో ఏర్పాటు చేసిన జన చైతన్య యాత్రలో ఆయన పాల్గొన్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయడం, స్పందించిన ప్రధాని వాటిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం భారతదేశ సమాజంలోనే పెను మార్పులు చోటుచేసుకున్నాయన్నారు.
ప్రభుత్వానికి ఆదాయం పెరగడంతో పాటు అన్ని వర్గాల పేదలకు మంచి జరగనుందన్నారు. ప్రధాని మోడీ నిర్ణయంతో నల్ల కుబేరుల్లో గుబులు రేగుతోందన్నారు. డిసెంబర్ 31 నుంచి వారు దాచుకున్న డబ్బంతా చిత్తుకాగితాల్లా మారుతుందన్నారు.