ప్యాకేజీ సరే కానీ: పత్తిపాటి, వారికీ జగన్ వెన్నుపోటు: మంత్రుల ఆగ్రహం
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదని మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీల రూపంలో రాష్ట్రానికి సాయం చేసేందుకు ప్రయత్నిస్తోందని, అయితే ప్యాకేజీతో పాటు హోదా కూడా తప్పనిసరి అన్నారు.
ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నిలబెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేయాలని తమ ప్రభుత్వం సంకల్పించిందన్నారు. ఆ స్థాయిలోనే కేంద్రం నుంచి నిధుల కేటాయింపులు ఉండాలన్నారు.
కాగా, ప్రత్యేక హోదా, ఓటుకు నోటు, కాపు ఉద్యమంతో పాటు రాష్ట్ర సమస్యల పైన చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తున్న వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రులు దుమ్మెత్తి పోస్తున్నారు. టిడిపి ఎమ్మెల్యేలు కూడా జగన్ పైన విరుచుకుపడుతున్నారు.
వైయస్ జగన్కు తమ పార్టీని, తమ పార్టీ అధినేత చంద్రబాబును విమర్శించే అర్హత లేదని మంత్రులు రావెల కిషోర్ బాబు, పల్లె రఘునాథ్ రెడ్డిలతో పాటు టిడిపి ఎమ్మెల్యేలు విమర్శలు గుప్పిస్తున్నారు. వైసిపి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోందని ఆరోపిస్తున్నారు.
జగన్కు షాక్: ముద్రగడ వెంటపడ్తున్న పవన్కళ్యాణ్
కాపు ఉద్యమం విషయమై మాట్లాడుతూ.. కులాలను రెచ్చగొట్టి రాష్ట్రంలో గందరగోళం సృష్టించేందుకు జగన్ ప్రయత్నాలు చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. వైసిపి దుష్ట రాజకీయాలను మానుకోవాలని మంత్రి రావెల కిషోర్ బాబు హితవు పలికారు.
జగన్ తన స్వార్థం కోసం క్విడ్ ప్రో కింద ఐఏఎస్లను బలి చేశారని పల్లె ధ్వజమెత్తారు. జగన్ కన్న తండ్రిని, రాజకీయంగా జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీని కూడా వెన్నుపోటు పొడిచారని రెండు రోజుల క్రితం దుమ్మెత్తిపోశారు.