జగన్ సర్కారు నష్టనివారణ- 40 ఆలయాల పునర్నిర్మాణం- 8న సీఎం శంఖుస్ధాపన
ఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం సహా ఇతర దేవాలయాల ఘటనలపై జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. తాజా పరిణామాలతో రాష్ట్రంలో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని భావిస్తున్న ప్రభుత్వం భారీ ఎత్తున ఆలయాల పునర్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గతంలో ఎన్నడూ లేని విధంగా 13 జిల్లాల్లో 40కి పైగా ఆలయాలను పునర్ నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయవాడ సహా ఇతర జిల్లాల్లో ఈ ఆలయాల పునర్ నిర్మాణ ప్రక్రియ ప్రారంభం కానుంది.
Recommended Video
జగన్ నష్టనివారణ చర్యలు
ఏపీలో ప్రభుత్వ ప్రమేయం ఉన్నా లేకపోయినా తాజాగా చోటు చేసుకున్న ఆలయాల విధ్వంసం, విగ్రహాల ధ్వంసం ఘటనలతో భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో తిరిగి భక్తుల్లో విశ్వాసం నింపడంతో పాటు విపక్షాల విమర్శలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఇప్పటికే గుళ్ల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ విషయంలో ఎవరినీ లెక్కచేయొద్దని నిన్న ఆదేశాలు ఇచ్చిన జగన్, తాజాగా పలు ఆలయాల పునర్ నిర్మాణానికీ పచ్చజెండా ఊపారు. దీంతో ప్రభుత్వం ఆలయాల విషయంలో చిత్తశుద్ధితో ఉందనే సంకేతాలు పంపాలని భావిస్తోంది.
బెజవాడ ఆలయాలతో మొదలు...
గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విజయవాడలో కృష్ణా పుష్కరాల ఏర్పాట్ల పేరుతో పలు ఆలయాలను తొలగించారు. వీటిని పునర్ నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. విజయవాడలో గతంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మిస్తామని దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ వెల్లడించారు. నగరంలో దక్షిణ ముఖ ఆంజనేయస్వామి ఆలయం, సీతమ్మ వారి పాదాలు, రాహుకేతువు ఆలయం, బొడ్డు బొమ్మ ఆలయం, గోశాల కృష్ణుడి ఆలయాలను తిరిగి నిర్మించబోతున్నట్లు వెల్లంపల్లి తెలిపారు. వీటితో రాష్ట్రంలో గతంలో కూల్చివేసిన, దెబ్బతిన్న ఆలయాల పునరుద్ధరణ ప్రారంభం కానుందన్నారు.
ఈ నెల 8న జగన్ శంఖుస్ధాపన
రాష్ట్రంలో చేపట్టనున్న ఆలయాల పునరుద్ధరణ పనులకు సీఎం జగన్ ఈ నెల 8న శంఖుస్ధాపన చేయబోతున్నారు. విజయవాడలో ఈ నెల 8న ఉదయం 11 గంటల ఒక్క నిమిషానికి జగన్ ఈ పనులను ప్రారంభిస్తారు. ముందుగా 70 కోట్ల రూపాయలతో చేపట్టే దుర్గగుడి అభివృద్ధి పనులకు జగన్ శంఖుస్దాపన చేస్తారు. దీంతో మొదలుపెట్టి రాష్ట్రంలో దెబ్బతిన్న గుళ్లలో పునర్ నిర్మాణ పనులు చేపడతామని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 13 జిల్లాల్లో 40 ఆలయాల పునర్ నిర్మాణ పనులు చేపట్టాలని నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
నాడు అధికారికంగా- నేడు దొడ్డి దారిలో
చంద్రబాబు విజయవాడలో గతంలో కూల్చిన దేవాలయాల పునర్ నిర్మాణంతోనే ఈ పనులు మొదలుపెడతామని దేవాదాయశాఖమంత్రి వెల్లంపల్లి తెలిపారు. గతంలో చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా దేవాలయాలను కూల్చేశారని, ఇప్పుడు దొడ్డి దారిన కూలుస్తున్నారని వెల్లంపల్లి విమర్శించారు. మతాల మధ్య చిచ్చుపెట్చి చంద్రబాబు పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారని ఆయన ఆరోపించారు. తొలి దశలో తాము 9 దేవాలయాలకు 2 కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నట్లు వెల్లంపల్లి తెలిపారు. రామతీర్ధం ఘటనలో సీఐడీ విచారణతో నిజానిజాలు వెలుగుచూస్తాయన్నారు.