నిర్వాకాలు చూశాం: చంద్రబాబుకు ఐవైఆర్ ఘాటు లేఖ, తాంత్రిక పూజలపై
విజయవాడ: దేవాలయాలలో మితిమీరిన జోక్యం తగదని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు సోమవారం అన్నారు. హిందూ దేవాలయాలు, ధార్మిక సంస్థల నిర్వహణలో అధికారులు, రాజకీయ నాయకుల మితిమీరిన జోక్యాన్ని తగ్గించాలని ఆయన సూచించారు.
Recommended Video
చదవండి: దుర్గ గుడిలో రహస్య పూజలు: ఈవో సూర్యకుమారికి ప్రభుత్వం షాక్, బదలీ ఉత్తర్వులు
దేవాలయాల్ని ప్రభుత్వం ఆదాయ సముపార్జన మార్గంగా చూడరాదని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు బహిరంగ లేఖ రాశారు. ఆలయాలను ఆదాయ మార్గాల అన్వేషణలో ఆలయాల్లో అనేక అపచారాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
శేఖర్ రెడ్డి చేసిన నిర్వాకాలు చూశాం
తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యుడిగా ఉంటూ శేఖర్ రెడ్డి అనే వ్యక్తి చేసిన నిర్వాకాలు చూశామని, టిటిడి ట్రస్ట్ బోర్డు సభ్యుల్లోను, చివరకు బోర్డు ఛైర్మన్లుగా పనిచేసి వారిలోనూ శేఖర్ రెడ్డిలాంటి వాళ్లు చాలామందే ఉన్నారని ఐవైఆర్ కృష్ణారావు అన్నారు.
అది వ్యవస్థను దెబ్బతీస్తోంది
ఇతర దేవాలయాల ధర్మకర్తల మండళ్లూ దీనికి భిన్నంగా ఏమీ లేవని, రూ.5 లక్షల కంటే తక్కువ ఆదాయం ఉన్న దేవాలయాల నిర్వహణ బాధ్యతను వాటికే విడిచిపెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోకుండా ధర్మకర్తల మండళ్లను నియమించిందని, అది వ్యవస్థను దెబ్బతీస్తోందని ఐవైఆర్ పేర్కొన్నారు.
దుర్గ గుడిలో తాంత్రిక పూజలపై
విజయవాడ కనక దుర్గగుడిలో ఇటీవల చోటు చేసుకున్న తాంత్రిక పూజల అంసంపై మాట్లాడారు. ఈ సంఘటన వ్యవస్థలో లోపాలకు నిదర్శనమని ఐవైఆర్ అన్నారు. ఆదాయం కోసం వివిధ రకాల పూజల పేరుతో ఎక్కువ ధరలు వసూలు చేస్తుండటంతో సాధారణ భక్తులు అసంతృప్తికి లోనవుతున్నారని చెప్పారు. ఆలనయ నిర్వహణలో రాజకీయ జోక్యం పెరిగిపోవడం వల్ల హిందూ ధార్మిక సంస్థల సంప్రదాయాలు, సంస్కృతి దెబ్బతింటోందన్నారు.
ఉద్యోగాలకు ప్రత్యేక విభాగం
ఏపీపీఎస్సీ ద్వారా దేవాదాయ శాఖలో సిబ్బందిని నియమిస్తుండటం వల్ల ఇతర మతస్తులు ఈ శాఖలో ఉద్యోగం పొందుతున్నారని ఐవైఆర్ చెప్పారు. దేవాదాయ శాఖ, ఆలయాల్లో పని చేసే సిబ్బంది నియామకానికి ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.